దీపావళి విషెస్: శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు జగన్, కేసీఆర్
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. లక్ష్మీ పూజ చేయడానికి అంతా సిద్దం అయ్యారు. దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని వివరించారు.
పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని అభిలషించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విష్ చేశారు. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పండుగ జరుపుకుంటామని తెలిపారు. అజ్ఞాన అంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు విరజిమ్మాలనే తత్వాన్ని దీపావళి చాటుతుందని కేసీఆర్ వివరించారు. దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.