ఏపీతోపాటు ఈ 10 రాష్ట్రాల్లోనే 75శాతం యాక్టివ్ కేసులు: భారత్ కోలుకుంటోంది!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండ్రోజుల క్రితం వరకు కూడా 4 లక్షలు దాటిన కరోనా కేసులు ఇప్పుడు 2 లక్షలకు పడిపోయాయి. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, కరోనా మరణాలు మాత్రం తగ్గడం లేదు.
Recommended Video
గర్భిణి మరణంపై హైకోర్టు ఆగ్రహం: కరోనా పరీక్షలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల కట్టడికి కీలక ఆదేశాలు
24 గంటల్లో లక్షమందికిపైగా రికవరీ..
గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01 లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఒక్కసారిగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,16,997కు తగ్గిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేవలం 10 రాష్ట్రాల్లోనే 75.04 శాతం కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది.
20శాతం లోపే కరోనా పాజిటివిటీ రేటు
కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 2.81 లక్షల మంది కరోనా బారినపడ్డారు. మే 9 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా, పాజిటివిటీ రేటు కూడా 18.17 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.10 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఏపీతోపాటు ఈ 10 రాష్ట్రాల్లోనే 75శాతం యాక్టివ్ కేసులు
రాష్ట్రాలవారీగా యాక్టివ్ కేసులను గమనించినట్లయితే.. అత్యధికంగా కర్ణాటకలో 6,00,168 కేసులున్నాయి. మహారాష్ట్రలో 4,70,595, కేరళలో 4,41,011, తమిళనాడులో 2,19,342, ఆంధ్రప్రదేశ్లో 2,10,436, రాజస్థాన్లో 1,94,382, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,63,003, పశ్చిమబెంగాల్లో 1,31,805, గుజరాత్లో 1,04,908, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1,03,593 యాక్టివ్ కేసులున్నాయి. ఈ పది రాష్ట్రాల్లోనే 75 శాతం యాక్టివ్ కేసులుండటం గమనార్హం.
మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యధిక మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 34,389 మంది కరోనా బారినపడగా, ఆ తర్వాత తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని చాలా జిల్లాలో పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ 4106 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 974 మంది మృతి చెందగా, కర్ణాటకలో 403 మంది చనిపోయారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 18.30 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.