పాక్ పిరికిపంద చర్య: రాజ్ నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఎల్ వోసీ ( నియంత్రణ రేఖ) వెంబడి దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ చర్యలపై కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ ను దెబ్బ తియ్యడానికి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్నదని, ఇది పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు.
గ్రేటర్ నోయిడాలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇండో టిబెటన్ భార్డర్ ఫోర్స్ (ఐటీబీసీ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన దాయాది దేశం పాకిస్థాన్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పాకిస్థాన్ ఎప్పుడూ ఇదే తరహాలో ఉగ్రచర్యలకు పాల్పడుతుందని, పిరికి వాళ్లే ఏమీ చెయ్యలేక ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకుని ఇలాంటి దాడులు చేస్తుందని విమర్శించారు. ధైర్యవంతులు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
భారత్ ను ఎదో ఒక విధంగా దెబ్బతియ్యడానికి పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న జమ్మూ కాశ్మీర్ లో ఊరీ ఉగ్రదాడి జరిగిన తరువాత పాక్ పదేపదే ఆర్మీ క్యాంపులపై దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు.
భారత ఆర్మీ ఎప్పుడూ పాక్ మీద మొదటి సారి కాల్పులు జరపదని, అయితే దాయాది దేశం మాత్రం కాల్పులకు పాల్పడితే మా బలగాలు ధీటుగా సమాధానం ఇస్తాయని రాజ్ నాథ్ సింగ్ పాక్ ను హెచ్చరించారు.
అభివృద్ది దిశగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకు వెలుతున్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇదే సమయంలో గుర్తు చేశారు. పాక్ హైకమిషన్ ఉద్యోగి మహమ్మద్ అక్తర్ విషయంపై మాట్లాడుతూ దేశ ద్రోహం చేసే వారి మీద తప్పక కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.