థండా థండా కూల్ కూల్.. ఓట్ ఫర్ తృణమూల్: మమతా బెనర్జీ: గ్రౌండ్ రియాలిటీ బోధపడిందా?
కోల్కత: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ.. ఇక రెండో అంకానికి చేరనుంది. గురువారం మలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమాయాత్తమౌతోందా స్టేట్. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ ముగిసేది ఈ విడతలోనే. తృణమూల్ నుంచి బీజేపీకి పార్టీ ఫిరాయించిన సువేందు అధికారికి కంచుకోటగా ఉన్న నందిగ్రామ్లో మమతా బెనర్జీ పోటీకి దిగడం ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఇఫ్పుడా విషయంపైనే అందరి దృష్టీ నిలిచింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనాచురలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. వందలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకో 48 గంటలు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గానీ, ఒత్తిళ్లకు గానీ గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. గందరగోళానికి గురి కావొద్దని కోరారు. ప్రశాంత మనస్సుతో తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె థండా థండా కూల్ కూల్.. ఓట్ ఫర్ తృణమూల్..ఓట్ పడే జోడా ఫూల్.. అంటూ నినదించారు.
#WATCH | During election cast your votes peacefully. Keep in mind, 'cool cool Trinamool, thanda thanda cool cool, vote pabe joda phool'. Keep your mind cool for 48 hours: West Bengal CM Mamata Banerjee in in Sona Chura, Nandigram. pic.twitter.com/jfFa3ZIrgP
— ANI (@ANI) March 30, 2021
పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయ ప్రత్యర్థులు ఓటర్లను అనేక రకాల ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆమె భారతీయ జనతా పార్టీని విమర్శించారు. మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగని ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే- 48 గంటల పాటు ప్రతి ఒక్క ఓటరు కూడా తమ మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురి కావొద్దంటూ పదేపదే కోరారు. పదేళ్ల తన పరిపాలనలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిని కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నికల కోసం విడుదల చేసిన మేనిఫెస్టో నుంచి దృష్టిని మరల్చవద్దని అన్నారు. బీజేపీని సమాధి చేయాలంటూ పిలుపునిచ్చారు. నందిగ్రామ్ నుంచి బీజేపీని తరిమి కొట్టాలని చెప్పారు. బీజేపీని తరిమి కొట్టడానికి ఎన్నికలకు మించిన అవకాశం మరొకటి రాదని అన్నారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు సృష్టించి.. రాజకీయంగా లబ్దిని పొందడానికి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కుట్రలు పన్నారని, దాన్ని ప్రశాంతంగా ఓటు వేయడం ద్వారా తిప్పికొట్టాలని మమతా బెనర్జీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మతం పేరుతో జనం మధ్య గోడ కట్టే పార్టీ కావాలో.. అభివృద్ధి కావాలో తేల్చుకోవడానికి ఇదే సరైన తరుణమని అన్నారు.