లక్ష మందికి ఎయిడ్స్: పాక్లో కండోమ్ యాడ్ బ్యాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో కండోమ్ యాడ్ పై నిషేధం విధించారు. కండోమ్ వాణిజ్య ప్రకటనలపైనా నిషేధం విధించామని అక్కడి ప్రభుత్వం ప్రకటించిందని పాకిస్థాన్ కు చెందిన ఓ దినపత్రిక తెలిపింది. ఇప్పటికే పాక్ లో ఎయిడ్స్ వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడరాదని ఆంక్షలు ఉన్నాయి.
ఎయిడ్స్ గురించి మాట్లాడుదాం, చర్చిద్దాం అంటూ ద న్యూస్ ఇంటర్నేషనల్ దినపత్రిక ఒక సంపాదకీయం రాసింది. అంతే కాకుండా ఎయిడ్స్ గురించి చర్చించడానికి పాకిస్థాన్ ఎప్పుడూ ముందుకు రాలేదని ఆరోపించింది.
ఈ విషయంపై సరిగ్గా వ్యవహరించని పాక్ ప్రభుత్వం కీలకమైన ఈ సమస్య పరిష్కారానికి నిరాకరిస్తున్నదని ఆ పత్రిక పేర్కొంది. ఇదే సందర్బంలో పాకిస్థాన్ లో ఎయిడ్స్ సమస్య భారీగానే ఉందని గుర్తు చేసింది.
ఎయిడ్స్ సమస్య ఉందని అంగీకరించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని, దేశ జనభాలో 0.1 శాతం మంది పెద్దలకు ఎయిడ్స్ వ్యాధి సోకిందని పాకిస్థాన్ అధికారులు లెక్కలు చెప్తున్నారని గుర్తు చేశారు.
పాకిస్థాన్ లో దాదాపు ఒక లక్ష మందికి ఎయిడ్స్ వ్యాధి ఉందని ప్రభుత్వం, యూనిసెఫ్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయని ఆ దిన పత్రిక వివరించింది. ఇప్పుడు కండోమ్ వాణిజ్య ప్రకటనల మీద నిషేధం విధించడంతో ప్రజలలో అవగాహన లోపిస్తుందని చెప్పింది.
దూర ప్రాంతాలకు వెళ్లే ట్రక్కు డ్రైవర్లు, సెక్స్ వర్కర్లు, మాదక ద్రవ్యాలు ఇంజక్ట్ చేసుకునే వారికి ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తున్నదని ఆ దిన పత్రిక గుర్తు చేసింది. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెబుతున్నది.