కావేరీ రగడ: అఖిలపక్ష సమావేశం, బీజేపీ బైకాట్
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చర్చించడానికి రావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అఖిపక్షాలకు మనవి చేశారు.
బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని సీఎం సిద్దరామయ్య ప్రతిపక్షాలకు తెలిపారు. అయితే ఈ సమావేశానికి హాజరుకాకూడదని బీజేపీ నిర్ణయించింది.
జేడీఎస్ నాయకులు ఈ సమావేశానికి హాజరు అయ్యే అవకాశం లేదని సమాచారం. సీఎం సిద్దరామయ్య అఖిలపక్ష సమావేశం నిర్వహించడం దండగ అని ప్రతిపక్షాలు అంటున్నాయి.
మేము ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెబుతుంటే ఆయన అది ఏమీ పట్టనట్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని బీజేపీ కార్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బీఎస్. యడ్యూరప్ప మండిపడుతున్నారు.
ముందు నిర్ణయించినట్లు యడ్యూరప్ప కడూరుకు వెళ్లారు. తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యరాదని మొదటి నుంచి బీజేపీ చెబుతున్నది. అయితే ఈ విషయంలో సిద్దరామయ్య ఎందుకు కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు అని ప్రజలకు చెప్పాలని యడ్యూరప్ప డిమాండ్ చేస్తున్నారు.
జేడీఎస్ పార్టీ సైతం అఖిలపక్ష సమావేశానికి హాజరు అయ్యేది అనుమానమే. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ జేడీఎస్ పార్టీకి చెందిన ఎంపీ పుట్టరాజు ఇప్పటికే రాజీనామా చేశారు. మిగిలిన జేడీఎస్ ఎంపీలు, శాసన సభ్యులు రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారు.