Riots: సీఎం సొంత జిల్లాలో మతఘర్షణలు, 62 మంది అందర్, కొడుకు ఎంట్రీతో టెన్షన్, కర్ఫ్యూ, ఏం జరిగింది!
బెంగళూరు/ శివమొగ్గ: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం వారసుడు, స్థానిక మంత్రి రంగంలోకి దిగడంతో టెన్షన్ మొదలైయ్యింది. సీఎం సొంత జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలో కర్ఫ్యూ అమలులో ఉంది. భజరంగ్ దళ్ నాయకుడి మీద కొందరు దాడులు చెయ్యడంతో గొడవలు మొదలైనాయి. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. సీఎం సహ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శుక్రవారం రోజు కర్ఫ్యూ అమలు చెయ్యడంతో అక్కడి ఇరు వర్గాల ప్రజలు టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు.
సీఎం సొంత జిల్లాలో కలకలం
కర్ణాటక సొంత జిల్లా శివమొగ్గలో అప్పుడప్పుడు ఇరు వర్గాల మద్య గొడవలు జరుగుతుంటాయి. శివమొగ్గ జిల్లా భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. మరో వర్గం దాడిలో భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ కు తీవ్రగాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఈ విషయం గంట వ్యవదిలోనే శివమొగ్గ జిల్లాతో పాటు కర్ణాటక మొత్తం తెలిసిపోయింది.
దెబ్బకు మతఘర్షణలు
భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ మీద దాడి చెయ్యడంతో శివమొగ్గ పట్టణంలో ఇరు వర్గాల మద్య గొడవలు మొదలైనాయి. ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమిషాల వ్యవధిలో శివమొగ్గ రణరంగంగా మారడంతో స్థానిక ప్రజలు భయంతో హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారికి నచ్చచెప్పడానికి విఫలయత్నం చేశారు.
సీఎం సొంత జిల్లాలో కర్ఫ్యూ
శివమొగ్గ పట్టణంలో పరిస్థితి అదుపు తప్పింది. అదనపు బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు ఇప్పటి వరకు 62 మందిని అరెస్టు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా శివమొగ్గ పట్టణంలోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలో శుక్రవారం రోజు పూర్తిగా కర్ఫ్యూ అమలు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో శుక్రవారం రోజు కర్ఫ్యూ అమలు కావడంతో స్థానిక ప్రజలు భయంతో హడలిపోతున్నారు.
సీఎం కొడుకు ఎంట్రీ
కర్ణాటక ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు, శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ బీవై. రాఘవేంద్ర శుక్రవారం శివమొగ్గలోని ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ ను పరామర్శించారు. నాగేష్ మీద దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదని, ఇలాంటి సంఘటనలు చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ బీవై. రాఘవేంద్ర హెచ్చరించారు.
ఏం జరుగుతోంది ?
తన సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శివమొగ్గలోని పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్న సీఎం బీఎస్. యడియూరప్ప శాంతిభద్రతలు కాపాడాలని పోలీసుల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక కర్ణాటక మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్. ఈశ్వరప్ప సైతం ఆసుపత్రి చేరుకుని భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ ను పరామర్శించారు. భజరంగ్ దళ్ నాయకుడు నాగేష్ మీద దాడి చేసిన వాళ్లని చట్టపరంగా కచ్చితంగా శిక్షిస్తామని మంత్రి కేఎస్. ఈశ్వరప్ప హెచ్చరించారు.