ఉద్యోగ,ఉపాధి రంగంలో బ్లడ్ బాత్.. కూలీలు,చిన్న వ్యాపారులు,వేతన జీవులపై ఎఫెక్ట్.. షాకింగ్ రిపోర్ట్స్.
కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. జీడీపీ అంచనాలు తలకిందులై.. ఆర్థిక తిరోగమనం వెంటాడుతోంది. ఈ ప్రభావం అనేక రంగాలపై పడటంతో ఒక్కసారిగా వేల సంఖ్యలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. మే 3వ తేదీతో ముగిసిన వీకెండ్ నాటికి భారత్లో నిరుద్యోగం 27.11శాతానికి చేరుకుంది. దీన్నిబట్టి కరోనా ఆర్థిక వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దినసరి కూలీలు,చిన్న వ్యాపారులపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.
వారిపై తీవ్ర ప్రభావం..,పడిపోయిన పారిశ్రామికవేత్తల సగటు..
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం.. 91.3 మిలియన్ల(9కోట్ల పైచిలుకు) మంది దినసరి కూలీలు,చిన్న వ్యాపారులు ఏప్రిల్ నెలలో జీవనోపాధిని కోల్పోయారు. అలాగే 18.2 మిలియన్ల మంది వ్యాపారవేత్తలు ఉపాధి కోల్పోయినట్లు అంచనా. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాలు,ఉపాధి కోల్పోవడం మానవ విషాదం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్లో 2019-2020లో బడా పారిశ్రామికవేత్తల సగటు 78 మిలియన్లు. ఇది 2020, ఏప్రిల్లో 60 మిలియన్లకు పడిపోయింది. ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వేతన జీవుల సగటు కూడా గణనీయంగా పడిపోయింది. 2019-20లో వారి సగటు 86 మిలియన్లు కాగా, 2020,ఏప్రిల్లో 68 మిలియన్లు మాత్రమే.
పడిపోయిన వేతన జీవుల సంఖ్య
వేతన ఉద్యోగాల వృద్ది రేటు పెరగడం లేదు. గత మూడేళ్లుగా వేతన జీవుల సంఖ్య 80మిలియన్ల నుంచి 90 మిలియన్ల లోపే ఉంది. ఇప్పుడిది 68 మిలియన్లకు పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. లాక్ డౌన్ పీరియడ్లో కోల్పోయిన ఉద్యోగాన్ని పొందడం వేతన జీవులకు పెద్ద సవాల్. నెలవారీ వేతనాలతో ఉద్యోగాలు పొందడం ఇప్పుడంత సులభం కాదని నిపుణులు అబిప్రాయపడుతున్నారు.మార్చి 15వ తేదీ నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 6.74 శాతంగా ఉండగా.. నెలన్నర వ్యవధిలోనే అది 27.11శాతానికి చేరుకోవడం గమనార్హం. ఏప్రిల్ 26 నాటికి 26.05శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు గత వారం కంటే ముందు 26.19శాతంగా ఉంది. నిరుద్యోగ రేటు క్రమంగా పెరుగుతూ పోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే విషయం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) ఈ వివరాలను వెల్లడించింది.
పట్టణాలు,నగరాల్లో నిరుద్యోగం రేటు..
CMIE వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణ,నగర ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అత్యధికంగా 29.22శాతానికి చేరుకుంది. ఇందులో మెజారిటీ పట్టణాలు, నగరాలు రెడ్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఎకానమీ యాక్టివిటీస్ నిలిచిపోవడంతో పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ నిరుద్యోగ రేటు 26.16శాతానికి చేరుకుంది. ఏప్రిల్ 26తో ముగిసిన వీకెండ్ నాటికి దేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 21.45శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 20.88శాతంగా ఉంది.CMIE డేటా ప్రకారం మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 8.74శాతం మేర పెరిగి 23.52శాతానికి చేరుకుంది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఉద్యోగ,ఉపాధి రంగాలపై దాని ప్రభావం పడినట్టు డేటా స్పష్టం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా చిన్న,మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడటంతో ఉద్యోగాల్లో కోత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
ఏయే రాష్ట్రంలో ఎంత ప్రభావం..
రాష్ట్రాలవారీ డేాను పరిశీలిస్తే.. ఏప్రిల్ చివరి నాటికి పుదుచ్చేరిలో అత్యధికంగా నిరుద్యోగ రేటు 75.8శాతానికి చేరుకుంది. అలాగే తమిళనాడులోనూ 49.8శాతానికి,జార్ఖండ్లో 47.1శాతానికి,బీహార్లో 46.1శాతానికి చేరుకుంది. మహారాష్ట్రాలో 20.9శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా.. హర్యానాలో 43.2శాతం,ఉత్తరప్రదేశ్లో 21.5శాతం,కర్ణాటకలో 29.8శాతానికి చేరుకుంది. పర్వత ప్రాంతాల్లోని