బాధ్యతలు చేపట్టేముందు అందిన లెటరే నాకు రోడ్ మ్యాప్: కేంద్రానికి మరో లేఖ: సీజేఐ ఎన్వీ రమణ
ఢిల్లీ: తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే సమయంలో అదే న్యాయస్థానంకు చెందిన మాజీ న్యాయమూర్తి రాసిన లేఖ తన పదవీకాలంకు రోడ్మ్యాప్గా మారిందని గుర్తుచేసుకున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ కఠిన సమయాల్లో చాలా ధైర్యంతో వ్యవహరించాలని చెబుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ తనకు లేఖ రాశారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ రాసిన మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఈ మాటలు జీవితాంతం తన మదిలోనే ఉంటాయని చెప్పారు.
కష్టసమయంలో ధైర్యంగా ముందుకెళ్లాలి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ రాసిన అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ అనే పుస్తకాన్ని వర్చువల్ పద్ధతిలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఆవిష్కరించారు. ఈ సమయంలో జస్టిస్ రవీంద్రన్ తనకు రాసిన లేఖను చదివి వినిపించారు. " ఇది కష్టకాలం. రోజులు కఠినమైనవి. సవాలుతో కూడుకున్న కాలం.ప్రతి రోజు ఒక పరీక్ష లాంటిదే.ఒక చీఫ్ జస్టిస్గా ధైర్యంతో ముందుకెళ్లాలి.
న్యాయం కోసం కట్టుబడిఉండాలి. సామాన్యుల కష్టాలను తెలుసుకోవాలి, సహన్యాయమూర్తులతో సోదరభావంతో మెలగాలి, వారి నుంచి సహాయసహకారాలు పొందేలా ఉండాలి. ఒక జడ్జికి ఇవి అదనంగా ఉండాల్సిన లక్షణాలు. ఇవన్నీ నీలో పుష్కలంగా ఉన్నాయి. ఆ భగవంతుడు నీ పదవీకాలంను సాఫీగా సాగేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఆ లేఖలో ఉన్న విషయాన్ని చదివి వినిపించారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
ప్రజల్లో గుర్తింపు లేకుండా మీడియాకు దూరంగా..
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణ లాయరు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఎలా ఎదిగారో ఈ సందర్భంగా జస్టిస్ రమణ గుర్తు చేశారు. తనలానే జస్టిస్ రవీంద్రన్ కుటుంబంలో కూడా అంతకుముందు ఎవరూ న్యాయవాది లేరని చెప్పారు. జస్టిస్ రవీంద్రన్ వారసత్వం నుంచి కొంత తాను పొందినట్లు చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. న్యాయప్రక్రియను తానొక్కడే రక్షిస్తున్నట్లుగా చూపించుకునే ప్రయత్నం జస్టిస్ రవీంద్రన్ ఎప్పుడూ చేయలేదని అన్నారు జస్టిస్ రమణ.
తాను చేపట్టిన పదవి తనకోసం అనే భావన ఎప్పుడూ జస్టిస్ రవీంద్రన్లో ఉండేది కాదని జస్టిస్ రమణ చెప్పారు. ఎవరైతే ప్రజలకు తక్కువగా తెలిసి ఉంటాడో.. అదే సమయంలో మీడియాకు దూరంగా ఉంటాడో అతనే ఉత్తమ న్యాయమూర్తి అని లార్డ్ డెన్నింగ్ చెప్పిన మాటలను జస్టిస్ రమణ గుర్తుచేశారు.
లీగల్ ప్రొఫెషనల్స్ను ఫ్రంట్లైన్ వర్కర్లుగా...
ప్యానెల్ డిస్కషన్ సందర్భంగా గ్రామీణ గిరిజన, కొండ ప్రాంతాల్లో కనెక్టివిటీ పై ఆందోళన వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. రెండు రోజుల పాటు ఆయా రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లతో సమావేశం సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చిందని చెప్పారు. డిజిటల్ పద్ధతితో కేసుల పరిష్కారంలో వేగం తగ్గిపోయిందని చెప్పారు. అంతేకాదు సత్వర న్యాయం వెలువరించడంలో కూడా జాప్యం జరుగుతోందని చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొన్ని వేల మంది యువన్యాయవాదుల జీవనోపాధిపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరతగతిన ఈ పద్ధతికి ముగింపు పలకాలని తాను కేంద్ర న్యాయ, సమాచారా మరియు ఐటీశాఖ మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఇక జీవనోపాధి కోల్పోతున్న న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. ఇక అదే సమయంలో లీగల్ ప్రొఫెషనల్స్ను ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించాలని తాను మంత్రిని లేఖ ద్వారా కోరినట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు.