నా బతుకు బతకనివ్వండి: చేపలు అమ్ముతూ కాలేజీ అమ్మాయి, ఆసక్తికర 'స్టోరీ'!
Recommended Video
తిరువనంతపురం: ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఓ విద్యార్థిని చదువుకుంటూనే చేపలు అమ్ముకుంటోంది. కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత చేపలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఆమె పేరు హనన్ హమీద్. ఆమె వయస్సు 19 ఏళ్లు. కేరళకు చెందిన ఈ యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభిమానిస్తుంటే, కొందరు మాత్రం అదంతా నిజం కాదని కొట్టి పారేశారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో నా బతుకు నన్ను బతకనీయండి అని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆమెను కొందరు మత చాంధసవాదులు ఎగతాళి చేశారు. చేతికి తొడుగులు వేసుకుందని, వేలికి బంగారు ఉంగరం ధరించిందని, ఆధునిక శైలిలో తల దువ్వుకుందని, పరధా ధరించలేదని కూడా బెదిరించారని తెలుస్తోంది.
చేపలు అమ్ముకుంటూ జీవనం
కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన హనన్ ప్రయివేటు కాలేజీలో బీఎస్సీ చదువుతోంది. హనన్ చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి మద్యానికి బానిస కావడం, తల్లి మెంటల్గా కుంగిపోయింది. దీంతో హనన్ చిన్నప్పటి నుంచే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇంటి బాధ్యతలు కూడా తీసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును ఆపలేదు.
చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదివింది. ప్రస్తుతం జీవనం కోసం కాలేజీ అయ్యాక చేపలు అమ్ముతోంది.
మార్కెట్కు వెళ్లి చేపలు తెచ్చి అమ్మకం
రోజూ ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చాక, హోల్సేల్ మార్కెట్కు వెళ్లి చేపలు తెచ్చుకుని వాటిని వీధుల్లో అమ్ముతోంది. హనన్ గురించి ఇటీవల స్థానిక వార్తా పత్రికలో కథనం వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. హనన్ కథ అందరినీ కదిలించింది. కొందరు మాత్రం దీనిపై విమర్శలు చేశారు. ఇదంతా నిజం కాదని, ప్రచారం కోసమే చేశారని విమర్శించారు.
కేంద్రమంత్రి మద్దతు
ఈ విమర్శలను ఆమె చదువుతున్న కళాశాల యాజమాన్యం కొట్టిపారేసింది. కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ కూడా దీనిపై స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో హనన్ జీవితంపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై విసుగెత్తిపోయిన ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా గురించి మాట్లాడటం ఆపాలని, తనకు ఎవరి సాయం వద్దని, నా జీవితానికి నన్ను వదిలేయండి అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి బాసట
మరోవైపు, ఆమె మోడ్రన్గా ఉండటంపై కొందరు చాంధసవాదులు బెదిరించడంపై సీఎం పినరాయి విజయన్ కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. ఎలాంటి ప్రచారాలకు భయపడకుండా తన పనిని సాగించాలని సూచించారు. ఆమెకు రక్షణ కల్పించాలని సూచించారు. ఓ విద్యార్థి తన కాళ్లపై తాను నిలబడటం ఎంతో గర్వించదగ్గ విషయమని, తాను సంపాదించిన సొమ్మును చదువు కోసం ఖర్చు చేయడంలో సంతృప్తి చాలా గొప్పదని, జీవితంలో అలాంటి అనుభవాలను పొందినవారు మాత్రమే దానిని అర్థం చేసుకోగలరని పినరాయి విజయన్ అన్నారు.