'గంటలో రిపోర్ట్ మారిపోయింది.. మమ్మల్ని వేధించారు' - ప్రెస్ రివ్యూ
లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు నగరంలో చేదు అనుభవం ఎదురైందని, ఒమిక్రాన్ అనుమానంతో పోలీసులు, ఇతర సిబ్బంది తనను వేధించినట్లు ఆమె పేర్కొన్నారని ఈనాడు తెలిపింది.
తొలుత కరోనా నెగిటివ్ అని, గంటలోనే పాజిటివ్ అని చెప్పి.. ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా బెదిరించారని వాపోయారు.
యంత్రాంగం తప్పులకు తాను, తన కుటుంబం తీవ్ర మనోవ్యథను ఎదుర్కొంటున్నట్లు ఆ మహిళ తెలిపారు.
''లండన్ విమానాశ్రయంలో కోవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ ధ్రువీకరణ పత్రం చూపినా.. పరీక్షలన్నీ చేసి నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ఎక్కించారు. ఐదేళ్ల పాపతో డిసెంబరు 1న ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగా. ఇక్కడా పరీక్షలు చేయాలన్నారు. దాదాపు 200 మందిని నిబంధనలు పాటించకుండా ఒక వరుసలో గంటల తరబడి నిలబెట్టారు.
45 నిమిషాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం కావాలంటే రూ.4,500 కట్టాలన్నారు. అప్పటికే గంటల నిరీక్షణ, పాపకూ ఇబ్బందిగా ఉండటంతో ఆ మొత్తం చెల్లించా. 2 గంటలకు నెగిటివ్ అని చెప్పారు.
పాపను తీసుకొని జీడిమెట్లలోని ఇంటికి బయల్దేరా. గంట తర్వాత పాజిటివ్ అంటూ ఇంకో మెయిల్ పంపారు. ఇంటికి వచ్చేసరికి పోలీసులు మోహరించారు. ఓ పోలీసు నాతో ఫోన్లో 'ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోవాలని’ దురుసుగా మాట్లాడారు. టాయిలెట్కూ వెళ్లనివ్వకుండా అంబులెన్సులో టిమ్స్కి తరలించారు.
ఇక్కడ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అక్కడే మరోసారి పరీక్ష చేసినా నెగిటివ్ వచ్చింది. అయినా ప్రసార మాధ్యమాల్లో మా చిత్రాలు, కుటుంబం వివరాలు ప్రచురిస్తున్నారు. యూకేలో ఉన్న నా భర్త, ఇక్కడ చిన్న పాప, కుటుంబం ఎంత మనోవ్యథ అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేను. ఎవరో చేసిన తప్పులకు మేం శిక్ష అనుభవించాలా?’’ అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారని పత్రిక తెలిపింది.
- వాయుగుండం, అల్పపీడనం, సైక్లోన్ ఐ... ఈ పదాలకు అర్థాలు తెలుసా?
- పరాగ్ అగర్వాల్: సిలికాన్ వ్యాలీలో భారత సంతతి సీఈవోల ఆధిపత్యానికి కారణమేంటి?
ఎవరూ మాస్క్ పెట్టుకోవట్లేదు
సెకండ్ వేవ్ సృష్టించిన విలయం, తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కూడా మాస్కు ధారణపై భారతీయులు పెద్దగా ఆసక్తి కనబర్చట్లేదని 'లోకల్ సర్కిల్స్’ సర్వేలో తేలినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇండ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతీ ముగ్గురిలో ఒకరు ముఖానికి మాస్కును ధరించట్లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లోని 25 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.
బయటికి వచ్చినప్పుడు..
34 శాతం మాస్క్ తెచ్చుకోవడం లేదు.
23 శాతం మాస్క్ ఉన్నా పెట్టుకోవడం లేదు.
38 శాతం మాస్క్ పెట్టుకున్నా సరిగా ధరించడం లేదు.
ఇవీ ఈ సర్వేలో వెల్లడైన విషయాలు.
నైపుణ్యాల పోటీలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానం
జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డిసి), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు శనివారంతో ముగిశాయని ప్రజాశక్తి పత్రిక తెలిపింది.
ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ హాలులో శనివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో కేరళ రాష్ట్రం 16 బంగారు, 16 వెండిపతకాలు మొత్తంగా 32 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
తర్వాత స్థానాన్ని కర్నాటక దక్కించుకుంది. 15 బంగారు, 14 సిల్వర్ మెడల్స్తో 29 పతకాలను సాధించింది.
మూడో స్థానంలో తమిళనాడు బంగారు పతకాలు 8, సిల్వర్ 13, నాల్గో స్థానంలో ఆంద్రప్రదేశ్ 12 బంగారు, 8 సిల్వర్ పతకాలు, తెలంగాణ కేవలం 2 బంగారు పతకాలు సాధించి ఆఖరి స్థానంలో నిలిచింది.
ఐదు రాష్ట్రాల నుంచి 124 మంది విజేతలుగా నిలిచారు. బంగారు పతకాలు సాధించిన వారికి క్యాష్ ప్రైజ్ రూ.21వేలు, వెండి పతకాలకు రూ.11 వేలు నగదు బహుమతి అందించారు.
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- యూపీఏ లాంటిదేమీ లేదని మమతా బెనర్జీ ఎందుకు అన్నారు? ఆమె ఉద్దేశ్యం ఏంటి?
'ఆమె ఓసీడీ తట్టుకోలేకపోతున్నాను'
భార్య ఓసీడీ భరించలేకపోతున్నానంటూ ఓ భర్త విడాకులు కోరిన కథనాన్ని సాక్షి తెలిపింది.
అతి శుభ్రతతో అవస్థలకు గురిచేస్తున్న భార్యను భరించలేను, ఆమె నుంచి విడాకులు కావాలని ఓ టెక్కీ పోలీసులను ఆశ్రయించాడు.
2009లో పెళ్లయిన ఓ జంట బెంగళూరు ఆర్టీ నగరలో కాపురం ఉంటోంది. ఉద్యోగ నిమిత్తం లండన్కు వెళ్లారు. పరిశుభ్రత పేరుతో భార్య నానా హంగామా చేసేదన్నాడు.
బెంగళూరుకు తిరిగి వచ్చాక ఈ దంపతులు కౌన్సెలింగ్ కూడా చేయించుకున్నారు.
ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే నిరంతరం శుభ్రత కోసం ఆమె తపించేది. పదేపదే ఉతకడం, పదే పదే తుడవడం వంటి ఆమె ప్రవర్తనను తట్టుకోలేక విడాకులు కావాలనుకుంటున్నట్లు తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
- 'ఫేస్బుక్ ప్రొటెక్ట్’ ఫీచర్: 5 క్లిక్లలో యాక్టివేట్ చేసుకోండిలా...
- విశాఖకు 200 కి.మీ దూరంలో జొవాద్ తుపాను, భారీ గాలులకు కొబ్బరిచెట్టు మీదపడి ఒకరు మృతి
- మాజీ సీఎం రోశయ్య ఇకలేరు
- 'ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ’
- క్వాంటం కంప్యూటర్: ఈ టెక్నాలజీలో అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలతో ఇండియా ఎందుకు పోటీ పడుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు
- 'ఒకడు ప్రకృతి.. మరొకడు ప్రళయం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)