అరటి పండ్లు ఇచ్చి పోలీసుల వింత విచారణ
ముంబై: ముంబై పోలీసులు విచిత్రంగా విచారణ చేసి ఓ దొంగ నుంచి వారికి ఏమి కావాలో అది రాబట్టుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ దొంగను కొట్టలేదు, తిట్టలేదు. కేవలం 48 అరటిపండ్లు తినిపించి ఫలితం రాబట్టారు.
ముంబైలో గోపి (25) అనే యువకుడు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. గస్తీ పోలీసులు విషయం తెలుసుకుని అతనిని వెంబడించారు. పోలీసులు వెంటపడుతున్నారని తెలుసుకున్న గోపి బంగారు గొలుసు కనపడకుండా మింగేశాడు.
పోలీసులు విచారణ చెయ్యగా గోపి తాను బంగారు గొలుసు మింగేశానని అంగీకరించాడు. వెంటనే ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లి ఎనీమా (కడుపు ఖాళీ చెయ్యడం) చేయించారు. అయినా ఫలితం లేదు.
యువకుడికి ఆపరేషన్ చేసి గొలుసు బయటకు తీస్తాం అని వైద్యులు చెప్పారు. దొంగ కడుపులో ఉన్న 25 గ్రాముల బంగారు గొలుసు విలువ కంటే ఆపరేషన్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని తెలుసుకున్న పోలీసులు తలలు పట్టుకున్నారు.
దొంగను పిలుచుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తరువాత పండుగా ఉన్న కొన్ని డజన్ల అరటి పండ్లు తెప్పించారు. గోపి దగ్గర ఉదయం నుంచి బలవంతంగా అరటి పండ్లు తినిపించి కడుపునిండా నీళ్లు తాగించారు. తరువాత అతనిని మలమూత్ర విసర్జనకు పంపించడం, తరువాత గొలుసు కోసం వెతకడం మొదలు పెట్టారు.
ఇలా సాయంత్రం వరకు ఆ దొంగ దగ్గర 48 అరటి పండ్లు తినిపించడంతో గొలుసు బయటకు వచ్చింది. ఆపరేషన్ చేయించి చేతులు కాల్చుకోవడం ఎందుకు, ఇలా చేసినా ఫలితం ఉంటుందని ముంబైలోని క్రైం బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శంకర్ ధనవాడే తెలిపారు.