షాకింగ్ : ఒకే సిరంజీతో 30 మంది విద్యార్ధులకు వ్యాక్సిన్..!!
కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అమల్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యాక్సినేటర్ నిర్లక్ష్యం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతోంది. ఏకంగా 30 మంది విద్యార్ధులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇవ్వటం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. దీనిని ఆలస్యంగా గమనించిన విద్యార్ధుల తల్లిదండ్రులు నిలదీసారు.
అయితే, దానికి వ్యాక్సినేటర్ ఇచ్చిన సమాధానం వారికి ఆగ్రహం తెప్పించింది. తనకు ఒకే సిరంజీ పంపారని.. దానితోనే వ్యాక్సిన్ వేయాలని సూచించారని జితేంద్ర చెప్పుకొచ్చారు. పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఇలా వ్యాక్సిన్ వేయటంలో తప్పు ఏముందంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో..ఈ సమాధానం విన్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహంతో దాడి చేయబోయారు. హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు ఈ వ్యాక్సిన్ వేసారు.
దీని పైన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ కు ఫిర్యాదు చేసారు. దీంతో..ఆయన స్పందించారు. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించారని ఇమ్యునైజేషన్ అధికారి చెప్పుకొచ్చారు. దీని పైన జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన జితేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఒకే సిరంజి వినయోగించటం వలన గతంలో చోటు చేసుకున్న ఘటనలు..వ్యాధుల వ్యాప్తి అంశాలు ఇప్పుడు చర్చకు కారణమవుతున్నాయి.