సైకిల్ మెకానిక్ ఐఏఎస్ సాధించాడు: ఎవరీ వరుణ్ భరన్వాల్
ముంబై: చిన్నవయసులోనే తండ్రి మరణించడంతో తన చదువుని ఆపేశాడో బాలుడు. అయితే చదువు మానేసిన ప్రతిసారీ ఏదో ఒకరూపంలో అతడికి ప్రోత్సాహం లభించడంతో తిరిగి చదువుని కొనసాగించి ప్రజాసేవే లక్ష్యంగా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
వివరాల్లోకి వెళితే... మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా, బైసర్ పట్టణానికి చెందిన వరుణ్ భరన్వాల్కి చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. వరుణ్ తండ్రికి సైకిల్ రిపేర్ షాపు ఉంది. దాంట్లో వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. వరుణ్తో పాటు అతడి సోదరికి కూడా మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం.

ఈ క్రమంలో వరుణ్ 2006లో పదోతరగతి పరీక్షలు రాసిన తర్వాత తండ్రి గుండెజబ్బుతో మరణించాడు. సైకిల్ షాపు లాభాల్లోనే కొనసాగుతున్నప్పటికీ, తండ్రి ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక వరుణ్ కుటుంబం అప్పులపాలైంది. వరుణ్ సోదరి టీచర్ అయినప్పటికీ ఆమె వేతనంతో ఇల్లుగడవడమే కష్టంగా మారింది.
ఇంటి పరిస్థితులను గమనించిన వరుణ్. చదువుకు స్వస్తి చెప్పి, తండ్రి సైకిల్ షాప్ వ్యాపారాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్న కొన్ని రోజులకు పదోతరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి. బైసర్ పట్టణంలోనే రెండో మార్కులు విద్యార్ధిగా వరుణ్ నిలిచాడు.
దీంతో తోటి స్నేహితులు, టీచర్లు వరుణ్ మార్కులను చూసి ఎంతో సంతోషించారు. ఆ తర్వాత అతడిని పైచదువులకు ప్రోత్సహించారు. దీంతో సైకిల్ షాపును తల్లికి అప్పగించి వరుణ్ తిరిగి చదువును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో మళ్లీ వరుణ్ ఆలోచనలో పడ్డాడు.

ఎందుకంటే కాలేజీ ఫీజు పదివేలు రూపాయలు కట్టలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వరుణ్ తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ కంప్లి.. వరుణ్ కోరికను తెలుసుకొని ఫీజు కట్టేందుకు ముందుకొచ్చాడు. జేబునుంచి పదివేల రూపాయలు తీసివ్వడంతో కాలేజీలో చేరాడు.
ఆ తర్వాత నెలవారీ ఫీజు కట్టేందుకు చదువుతోపాటు రేయింబగళ్ళు ఖాళీసమయాల్లో ట్యూషన్లు చెప్పేవాడు. వచ్చిన సంపాదనతో ఫీజులను కట్టుకునేవాడు. ఇలా ఇంటర్ వరకూ చదువుని పూర్తి చేసిన వరుణ్ ఎంఐటీ కాలేజ్ పూనెలో ఇంజనీరింగ్ లో చేరాడు.
మొదటి ఏడాది మంచి మార్కులు తెచ్చుకున్న వరుణ్ ఆ తర్వాత స్కాలర్ షిప్ తెచ్చుకొన్నాడు. 2012లో ఇంజనీరింగి చివరి ఏడాది క్యాంపస్ సెలెక్షన్లో మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్లో ఉద్యోగం సంపాదించాడు. ఇక తన జీవితం అంతా సుఖమయం అని అనుకున్న సమయంలో మరో మలుపు తిరిగింది.
అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్ కోసం అన్నా హజారే నిర్వహించిన ఉద్యమం వరుణ్లో స్ఫూర్తిని నింపింది. దీంతో ప్రజలకు సేవ చేయాలని భావించిన వరుణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిశ్చయించుకొని, మిత్రుల సహాయంతో ఆర్నెల్లపాటు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు.
ఉద్యోగం మానేసి యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవడంతో పుస్తకాలు కొనడానికి కూడా ఇబ్బందులు పడ్డాడు. చివరికు ఓ ఎన్జీవో సంస్థ సహాయంతో పుస్తకాలు కొని పట్టుదలతో చదివి 2014 యూపీఎస్సీ పరీక్షల్లో 32వ ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్ నగర్లో అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.












Click it and Unblock the Notifications