ఇది ఆరంభం మాత్రమే: అందరూ సుదీర్ఘ పోరాటం చెయ్యాలని మోడీ మరో సూచన
కరోనా మహమ్మారి తన రూపం మార్చుకుంటున్న నేపధ్యంలో అరికట్టటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది . కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి 'జనతా కర్ఫ్యూ'లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యారు . కరతాళ ధ్వనులతో మోడీకి మద్దతు తెలిపిన ప్రజలు, కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులకు , నర్సులకు, పోలీసులకు , శానిటరీ వర్కర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యులకు, శాస్త్రవేత్తలకు, కార్మికులకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో థ్యాంక్స్ చెప్పటం మాత్రమే కాదు ఇంకా కరోనాను తరిమి కొట్టేవరకు పోరాటం సాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ లాంటి మహానగరాల నుంచి మారుమూల పల్లెటూళ్ల వరకూ ప్రజలు ఇలా చప్పట్లు కొట్టి తమ వంత మద్దతు తెలపటంతో చప్పట్లు కొట్టిన ప్రజలందరికీ అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఈ సందర్భంగా ఆయన ఇవి కేవలం చప్పట్లు మాత్రమే కాదని, కరోనా వైరస్పై పోరాటంలో విజయనినాదమని పేర్కొన్నారు . భారత్ కరోనాపై సమిష్టి పోరాటం చేస్తుందని అన్నారు. కరోనా మీద పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ కానీ అప్పుడే దీనిపై గెలిచినట్టు కాదన్నారు. ఇది ఆరంభం మాత్రమే అన్నారు. ఇదే సంకల్పంతో, ఈ సమయంలో మరో సుదీర్ఘ పోరాటం చేద్దామని , మనల్ని మనం స్వీయ నిర్బంధంలో ఉంచుకుందామని మరో సూచన చేశారు ప్రధాని మోదీ.