ఇదేమీ ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కాదు .. బైక్ లు, కార్లు వాడితే సీజ్ చేసుడే అంటున్న పోలీసులు
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతుంది. అటు ప్రభుత్వాలు కరోనాకు అడ్డు కట్ట వెయ్యటానికి శాయశక్తులా పని చేస్తున్నప్పటికీ చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇక దీనిని అదుపు చెయ్యటానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే పరిష్కారం అని చెప్తున్నా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి కొంతమంది ప్రజలు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు.ఇక వీరిని ఆపటానికి కర్ణాటక పోలీస్ శాఖ మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో బైకులు, కార్లు వాడితే సీజ్ చేస్తామని కర్ణాటక డీజీపీ హెచ్చరించారు.
కర్ణాటక లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇక కర్ణాటక డీజీపీ చేసిన ట్వీట్ లో ఇదేమీ ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కాదు. లాక్ డౌన్ ను పట్టించుకోకుండా ఏప్రిల్ 14 వరకు బైకులు, కార్లు వాడితే సీజ్ చేస్తాం అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది తమ దగ్గర పాస్లు ఉన్నాయని.. మరికొందరు తమకు అనుమతులు ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. నిత్యావసరాలు కొనుగోలుకు ఎలా వెళ్ళాలి ఎలా తెచ్చుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు.
అయితే పోలీసులు మాత్రం రెండు రోజుల క్రితమే తమకు ఆర్డర్లు వచ్చాయని.. ఇప్పటికే 5200 వాహనాలను సీజ్ చేశామని బెంగళూరు పోలీస్ కమీషనర్ భాస్కర్ రావు తెలిపారు. పక్కనే ఉన్న కిరణా షాపులకు బైకుపై కాకుండా నడిచి వెళ్ళాలని సూచించారు. కచ్చితంగా బైక్ లు వాడినా, కార్లను బయటకు తీసుకొచ్చినా సీజ్ చేసి తీరతాం అని చెప్తున్న పరిస్థితి . మరోవైపు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించిన వారి వాహనాలను గుర్తించి సీజ్ చేయడం లేదా ఫైన్లు వేయడం జరుగుతున్నట్లు తెలుస్తుంది.