తెలంగాణ సహా ఆ రాష్ట్రాల పరిస్థితి ఇది: కాంగ్రెస్పై ప్రధాని మోడీ విమర్శల దాడి
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఆర్థికంగా చేయగలిగే హామీలు మాత్రమే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత పార్టీకి సూచించిన నేపథ్యంలో ప్రధాని మోడీ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బూటకపు వాగ్ధానాలు చేయడం సులభమే కానీ.. వాటిని అమలు చేయడం చాలా కష్టం లేదా అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తోంది అని ఎక్స్ వేదికగా మోడీ పేర్కొన్నారు.
ఆచరణ సాధ్యం కానీ హామీలని తెలిసినా.. ప్రచారంలో ఊదరగొట్టారని.. ఇప్పుడేమో ప్రజల ముందు ఘోరంగా నిలబడ్డారంటూ #fakepromisesofcongress అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాన్ని చూసినా.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని, ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శించారు ప్రధాని మోడీ.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమంటే.. వారిని మోసగించడమేనని అన్నారు. ఇలాంటి రాజకీయాలతో పేదలు, యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నిరాకరించడమే కాదు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను కూడా నీరుగార్చేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బూటకపు హామీల సంస్కృతిపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు, దోపిడీలో బిజీగా ఉందంటూ విమర్శించారు ప్రధాని మోడీ. అక్కడ ఇప్పటికే ఉన్న పథకాలు కూడా ఉపసంహరించుకుంటున్నారని ఆరోపించారు. హిమాచల్ప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతం చెల్లించడం లేదన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు. గతంలో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని అలవెన్సులు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఐదేళ్లపాటు ప్రభుత్వంలో ఉండి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందనేదానికి ఇవన్నీ ఉదాహరణలన్నారు.
In Karnataka, Congress is busier in intra-party politics and loot instead of even bothering to deliver on development. Not only that, they are also going to rollback existing schemes.
— Narendra Modi (@narendramodi) November 1, 2024
In Himachal Pradesh, salaries of Government workers is not paid on time. In Telangana, farmers…
హర్యానా ప్రజలు కాంగ్రెస్ నేతల హామీలను ఎలా తిరస్కరించారో ఇటీవలే అందరమూ చూశామని గుర్తు చేశారు. అక్కడ ప్రజలు సుస్థిరత, అభివృద్ధితో నడిపించే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు పాలనా రహితం, అసమానమైన దోపిడీకి దారితీస్తుందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు అభివృద్ధి, ప్రగతిని కోరుకుంటున్నారని చెప్పారు. అయితే, ప్రధాని మోడీ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. కర్ణాటకలో ప్రతి హామీని అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రధాని చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలే నెరవేర్చడం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications