ఈసారైనా ఢిల్లీ పీఠం బీజేపికి దక్కేనా..! రెండు దశాబ్దాల కల నెరవేరేనా..?!!
ఢిల్లీ/హైదరాబాద్ : దాదాపు రెండు దశాబ్దాలుగా ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకుందామనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అది అందని ద్రాక్షగా మారింది. 1993 లో 70 సీట్లలో 49 సీట్లుతో గెలిచి అధికారం దక్కించుకుంది.. ఆ తరువాత ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. 1998లో కాంగ్రెస్ 50 స్థానాలు సంపాదించుకుని షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి 2003లో 47 స్థానాలు, 2008లో 43 స్థానాలతో కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధించింది. షీలా దీక్షిత్ కూడా జనరంజకంగా పాలించారనే పేరు కూడా సంపాదించుకున్నారు. కాని మారుతున్న కాలం ప్రకారం బీజేపి కూడా తన సత్తా చాటుకుంటున్నట్టు తాజాగా జరిగిన ఎన్నికలు నిరూపిస్తున్నాయి.
బీజేపిని ఊరిస్తున్న ఢిల్లీ..! ఈసారైనా అదికారం దక్కేనా..!!
ఆ తరువాత అన్నా హజారే లోక్ పాల్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన అర్వింద్ కేజ్రీవాల్, అదే ఊపులో 2013లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నారు. కాకపోతే ఆ సారి మ్యాజిక్ ఫిగర్ కి అయిదు సీట్ల దూరంలో బీజేపీ ఆగిపోయి 31 సీట్లతో సరిపెట్టుకుంది. మోదీ హావా నడుస్తున్న తరుణంలో బీజేపీకి అవకాశం రాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి తమకు వచ్చిన 8 సీట్లతో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలికింది. అప్పటికి ఆ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం బయట నుంచే కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధమవ్వడంతో కేజ్రీవాల్ కూడా అధికారం చేపట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు విసిగి పోయిన ఆయన కొంత కాలానికే రాజీనామా చేసేశారు. అప్పుడు కూడా బీజేపీకి అవకాశం రాలేదు.
2014లో 7 పార్లమెంట్ వచ్చినా దక్కలేదు..! ప్రస్తుతం 7స్థానాల్లో బీజేపి విజయం..!!
2014 సార్వత్రిక సమరంలో మోదీ హవాతో దిల్లీ పరిధిలో ఉండే 7 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. దాంతో తరువాత జరిగే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించడం లాంఛనమే అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆప్ 67 స్థానాలను కైవసం చేసుకుని మోదీ, అమిత్ షా ద్వయానికి ఓ రేంజ్ లో షాక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 46 శాతం ఓట్ల శాతం సాధించినా బీజేపీ అసెంబ్లీ కొచ్చేసరికి 32.4 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు దిల్లీ అసెంబ్లీ పరిధిలో పార్టీని ముందుకు నడిపిన డా.హర్షవర్ధన్ ని మంత్రి పదవి ఇచ్చి కేంద్రానికి పరిమితం చేశారు. అనూహ్యంగా కిరణ్ భేడీని తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ క్యాడర్ ముందు ఉంచారు.
కేజ్రీ వాల్ పై తగ్గిన క్రేజ్..! ఆప్ కు అనూహ్యంగా తగ్గిన ఓటింగ్ శాతం..!!
అప్పటి వరకు ఉన్న హర్షవర్ధన్ లేకపోవడంతో తమకి అవకాశం వస్తుందని ఎదురు చూసిన ఇతర నాయకులకు కిరణ్ భేడీ రాక రుచించకపోవడంతో ఎన్నికల్లో పూర్తిస్థాయి దృష్టిపెట్టలేదనే చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఆత్మహత్యకు సిద్ధపడి తాను అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు బీజేపీకి మాత్రం దక్కకూడదని తెరవెనుక ఆప్ కు సహకరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 16 శాతం తన ఓట్ల షేర్ ని 9శాతానికి దిగజారేందుకు సిద్ధమైంది. మరోవైపు ఒకసారి రాజీనామా చేసి దిల్లీ ఓటర్లను మోసం చేశానని మరోసారి ఈ తప్పు చేయనంటూ కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణ పలు వేదికల్లో చెప్పడం కొంత అక్కడ ప్రజలను ఆలోచింపజేసింది. ఫలితంగా సునామీలా 67 సీట్లు కైవసం చేసుకుంది. దాంతో అధికారం దూరమై 21 సంవత్సరాలైనా ఇంకా దిల్లీ అసెంబ్లీ పీఠం బీజేపీని ఊరిస్తూనే ఉంది.
మరి ఈ సారి ఏం జరుగుతుంది..? బీజేపి అదికారం చేపట్టడంపైనే అందరి దృష్టి..!!
సరిగ్గా ఏడాది తరువాత దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019 సార్వత్రిక సమయంలో 7 సీట్లు బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఓట్ల శాతం ఎవరూ ఊహించని విధంగా 56.6 శాతంతో అధికారంలో ఉన్న ఆప్ కు షాక్ ఇచ్చారు. 2014లో కూడా 7 సీట్లు గెలుచుకున్నా కేవలం 46 శాతమే బీజేపీకి దక్కాయి. ఇది బీజేపీకి కలిసొచ్చే అంశమైతే కాంగ్రెస్ అనూహ్యంగా 9 శాతం నుంచి 22.5 శాతానికి పెరిగింది. దీంతో అధికార పార్టీ ఆప్ కేవలం 18.1 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఏడాదిలో మళ్లీ ఆప్ వైపు దిల్లీ ఓటర్లు చూసే అవకాశం ఉందా అనేది సందేహమే.. మరోవైపు కాంగ్రెస్ సైతం తన అస్తిత్వం కోసం పోరాడుతూ ఉంది. సార్వత్రిక సమరంలో ఆప్ తో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం, పంజాబ్ లో బీజేపీ కన్నా ఆప్ తోనే తమకి ముప్పు ఉందని గ్రహించడం వంటి కారణాలతో కాంగ్రెస్ తెరవెనుక కూడా ఆప్ కి సహకరించదని అర్థమవుతోంది. దీంతో రెండు దశాబ్దాల బీజేపీ కల నెరవేరే పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.