సంద్రం ఎరుపెక్కింది! గులాబీ పక్షులతో ప్రకృతి అద్భుతం!
సాధారణంగా బీచ్ లో ఎంతో ఆహ్లాదంగా మన పాదాల్ని తాకే కేరటాలు అప్పుడప్పుడు అద్భుతాలను కూడా మన కళ్లముందు ఉంచుతాయి. కానీ అలాంటి ప్రకృతి సోయగాన్ని చూడాలంటే మాత్రం అండమాన్, మాల్ దీవులు లేదా ఇతర దేశాల్లో ఉన్న ఐల్యాండ్ కు వెళ్లాలి. కానీ బుధవారం ఉదయం మనదేశంలోనే ఓ ఫేమస్ బీచ్ ఎర్రగా మారింది. ఇది చూసి ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ కు వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. రోజూ చూసే సాగర తీరం ఇవాళ ఎర్రుపెక్కి పిచ్చెక్కిస్తుంటే.. పర్యటకులు పండగ చేసుకున్నారు.
ఆకాశంలో అద్భుతాలు జరగడం మనం చూస్తుంటాం.. కానీ, ఆ సముద్ర తీరంలో అడుగుపెడితే భూమి మీదే ఒక సరికొత్త లోకంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. నీలి రంగు అలలు ముద్దాడుతుండే తూత్తుకుడి హార్బర్ బీచ్.. ఇప్పుడు అకస్మాత్తుగా ఎరుపు రంగు తివాచీ పరిచినట్లు మారిపోయింది! ప్రకృతి తన రంగుల పెట్టెను తీసి బీచ్పై ఒంపేసిందా అన్నట్లు.. ఎటు చూసినా ఎర్రటి సముద్రపు నాచు (Red Seaweed) కొట్టుకొచ్చి తీరాన్ని ఒక అద్భుత కావ్యంగా మార్చేసింది. ఈ వింతను చూసేందుకు పర్యాటకులు, స్థానికులు తీరానికి క్యూ కడుతున్నారు.

సముద్ర గర్భం నుంచి తీరానికి.. ఎందుకీ మార్పు?
మరైన్ నిపుణులు, మత్స్యకారుల సమాచారం ప్రకారం.. ప్రసిద్ధ 'మన్నార్ గల్ఫ్' (Gulf of Mannar) సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఈ రకమైన ఎర్ర నాచు సహజంగా పెరుగుతుంది. అయితే, ప్రస్తుతం సముద్రంలో వీస్తున్న కాలమార్పు గాలులు, మారిపోతున్న నీటి ప్రవాహాల (Ocean Currents) వల్ల ఈ నాచు భారీగా విడిపోయి, కొట్టుకుంటూ వచ్చి ఇక్కడి తీరానికి చేరింది. ఇదొక సహజమైన భౌగోళిక ప్రక్రియే అయినప్పటికీ, బీచ్ను విజువల్ వండర్గా మార్చడంతో పర్యాటకులు దీన్ని చూసి థ్రిల్ అవుతున్నారు. తమ కెమెరాలకు పనిచెప్తూ ఫొటోలు, సెల్ఫీలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
గులాబీ రంగు రెక్కలతో.. ఫ్లెమింగోల పండగ!
ఈ ఎర్రటి నాచు మాయాజాలానికి కొద్దిరోజుల ముందే, తూత్తుకుడిలోని ఉప్పు మడుల (Salt Pans) ప్రాంతం మరో వింతకు వేదికైంది. వేల మైళ్ల దూరం నుండి వలస వచ్చిన వందలాది 'ఫ్లెమింగో' (రాజహంసలు) పక్షులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. తెల్లటి ఉప్పు మడుల మధ్య.. గులాబీ, తెలుపు రంగులు కలగలిసిన ఈ పక్షుల గుంపులు వాలడంతో ఆ ప్రాంతమంతా ఒక పెయింటింగ్లా మారిపోయింది. పక్షి ప్రేమికులకు, నేచర్ ఫొటోగ్రాఫర్లకు ఇది కనువిందు చేస్తోంది.
"ఫ్లెమింగోలు చాలా ఎత్తైనవి, ఎంతో అందమైన పక్షులు. తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి వంటి దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లోని ఉప్పు మడులు, చిన్న చిన్న కానలు వీటికి అద్భుతమైన మేతను అందిస్తాయి. అందుకే ఇవి ప్రతి ఏటా ఇక్కడికి వలస వస్తాయి." - మతివానన్, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ (ATREE)
పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ఇస్తున్న పిలుపు!
ఒకవైపు ఎర్రటి నాచుతో ఎరుపెక్కిన సముద్ర తీరం.. మరోవైపు గులాబీ రంగు ఫ్లెమింగోల సందడి.. తూత్తుకుడి తీర ప్రాంత పర్యావరణం ఎంత సుసంపన్నమైనదో చెప్పడానికి ఇవే నిదర్శనం. అయితే, ఈ అరుదైన జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ముఖ్యంగా పక్షుల వలస కాలంలో ఈ తీర ప్రాంతాలను కాలుష్యం బారిన పడకుండా రక్షించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా, ప్రకృతి ప్రసాదించిన ఈ రెండు అద్భుతాలు ఇప్పుడు తమిళనాడు టూరిజంలో హాట్ టాపిక్గా మారాయి!














Click it and Unblock the Notifications