అడ్డుకుంటే రథచక్రాల కింద తలలు నలిగిపోతాయ్: బీజేపీ లాకెట్ వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ (భారతీయ జనతా పార్టీ) రథయాత్రను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు రథం చక్రాల కింద నలిగిపోతాయని బీజేపీ నాయకురాలు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ రథయాత్ర చేపట్టబోతోంది. దీనిపై అధికార టీఎంసీ పార్టీ కుట్రలు చేస్తోందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లాకెట్ ఛటర్జీ స్పందించారు. బెంగాల్లో తమ పార్టీ చేపట్టబోతున్న రథయాత్రను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే బాగుండదని హెచ్చరించారు. డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో రథయాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది.

పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ యాత్రను ప్రారంభిస్తారు. చివరి రోజు కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తమ రథయాత్ర ఉద్దేశమని, అయితే ఈ యాత్రను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, వారి తలలు రథ చక్రాల కింద పడి నలిగిపోతాయని హెచ్చరించారు.
ఛటర్జీ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత పార్థా ఛటర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీజేపీ విభజన రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారన్నారు.












Click it and Unblock the Notifications