జై శ్రీరాం ఎఫెక్ట్? దీదీ తలకు వెల.. కోటి నజరానా ఇస్తానని లేఖ..
కోల్కతా : బెంగాల్లో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ఎన్నికలకు ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ప్రారంభమైన ఘర్షణలు ఫలితాలు వెలువడిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో వెలుగులోకి వచ్చిన ఓ లెటర్ కలకలం రేపింది. సీఎం మమతా బెనర్జీని తలకు వెలకడుతూ రాసిన లేఖపై తృణమూల్ నేతలు పోలీసులు ఆశ్రయించారు.
ఆ రాష్ట్రంలో కొనసాగుతోన్న హింస...శాంతి భద్రతలపై ప్రశ్నించిన కేంద్రం
దీదీ తల తెస్తే కోటి నజరానా
తృణమూల్ ఎంపీ అపురూప పొద్దార్కు అందిన లేఖలో దుండగులు సీఎం మమత బెనర్జీపై అక్కసు వెళ్లగక్కారు. మమత ఫోటోను మార్ఫ్ చేసి రాక్షసురాలిగా మార్చారు. అంతటితో ఆగకుండా దీదీని చంపి తల తెచ్చినా.. సజీవంగా పట్టుకొచ్చినా వారికి కోటి రూపాయలు నజరానా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. రాజీవ్ కిల్లా పేరుతో పూర్తి చిరునామా, మూడు ఫోన్ నెంబర్లతో కూడిన ఆ లేఖను ఎంపీ అపురూప శ్రీరాంపూర్ పోలీసులకు అప్పగించారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
తనకు సంబంధంలేదన్న రాజీవ్ కిల్లా
మమత తలకు వెలకడుతూ రాసిన లెటర్పై తృణమూల్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించేలోపే రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఎవరో తనపై కుట్రపన్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తన పేరుతో మమత తలకు వెలకట్టినట్లు లేఖ రాశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ అపురూపకు అందిన లెటర్తో తనకు ఎలాంటి సంబంధంలేదని రాజీవ్ కిల్లా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జైశ్రీరాం నినాదాలతో దీదీని ఇబ్బందిపెడుతున్న బీజేపీ కార్యకర్తలే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని తృణమూల్ ఆరోపించింది.
గతంలోనూ దీదీపై విమర్శలు
బెంగాల్లో జై శ్రీరాం నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై మమత బెనర్జీ కక్ష గట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ మధ్య కొంతకాలంగా ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జై శ్రీరాం నినాదాలు చేస్తున్న వారిపై దీదీ కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ గతవారం మండిపడ్డారు. ఆమె రాక్షస జాతికి చెందిన వ్యక్తి అయినందునే అలా చేస్తున్నారని ఆరోపించారు. హిరణ్యక శివుడు తన ఇష్టదైవాన్ని తలచుకున్నందుకు తన కుమారుడు ప్రహ్లాదున్ని జైలులో పెట్టాడని, బెంగాల్లో ఇప్పుడు అదే పునరావృతం అవుతోందని సాక్షి మహరాజ్ ఆరోపించారు.
ఎన్నికలకు ముందు నుంచి ఉద్రిక్తతలు
వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి బెంగాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షలు కొనసాగుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 18స్థానాలు దక్కించుకుంది. దీంతో బెంగాల్లో దాడులు, ప్రతిదాడులు తీవ్రమయ్యాయి. ఇరుపక్షాలు పరస్పరం బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే మమత తల తెచ్చిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తామంటూ లేఖ వెలుగు చూడటం కలకలం రేపింది.