యోగి సంస్థలో పనిచేస్తూ యువతిపై గ్యాంగ్రేప్: నిందితుల అరెస్ట్, ఎస్ఐపై దాడి
సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినిలో పనిచేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బరేలీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినిలో పనిచేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. బరేలీ నగరంలోని గణేశ్ నగర్ ప్రాంతానికి చెందిన హిందూ యువవాహిని కార్యకర్త అయిన అవినాష్ తన సహ కార్యకర్తలైన అనిల్ సక్సేనా, జితేంద్రలను దీపక్ అనే వ్యక్తి ఇంటికి పిలిచాడు. అవినాష్, అనిల్, జితేంద్రలు కలిసి అక్కడ ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు.
ఘటన జరిగిన అనంతరం దీపక్ తన సోదరుడు గౌరవ్తో వచ్చి అత్యాచారానికి పాల్పడ్డ అవినాశ్ను పోలీసులకు అప్పగించాడు. దీపక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిగితా నిందితులను అరెస్టు చేశారు.
ఈ తెలియడంతో హిందూయువ వాహినీ సంస్థకు చెందిన ప్రాంతీయ అధ్యక్షుడు జితేంద్ర శర్మ, నగర విభాగం అధ్యక్షుడు పంకజ్, బీజేపీ నగర అధ్యక్షుడు ఉమేష్ కథారియా, ఇతర కార్యకర్తలు పోలీసుస్టేషన్కు వచ్చి ధర్నా చేయడంతోపాటు ఎస్ఐ మయాంక్ అరోరాను కొట్టారు.
ఓ యువతిపై గ్యాంగ్ రేప్, ఎస్ఐపై చేయిచేసుకున్న ఘటనలపై రెండు కేసులు నమోదు చేశామని నగర ఎస్పీ రోహిత్ సింగ్ చెప్పారు. ఈ కేసుల్లో నిందితులైన అవినాష్, జితేంద్ర, పంకజ్లను అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు.