రాజస్థాన్లో గర్ల్స్పై రేప్: 24గంటల్లో అరెస్ట్, సిఎం ట్వీట్
మొదటి ఘటన శనివారం ఖోళీ గ్రామంలో చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక తమ మేకలను మేపేందుకు వెళ్లి మిస్ అయింది. ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది. కూతురు విగత జీవిగా మారిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు... ఆమె పైన కొందరు అత్యాచారం చేశారని, అనంతరం గొంతు నులిమి చంపేశారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.
రెండో ఘటన శనివారం జరిగింది. నారాయణపుర గ్రామంలో ఐదేళ్ల బాలికను పక్కింటి వ్యక్తి అత్యాచారం చేశాడు. అతని పైన కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.
మూడో సంఘటన లాడ్లీకా బాస్ గ్రామంలో జరిగింది. పదిహేనేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ అత్యాచారాల పైన దుమారం చెలరేగింది. మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె వెంటనే స్పందించారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో సత్వరమే స్పందించిన పోలీసులు మూడు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. మొదటి ఘటనలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు.
కాగా, ఈ అత్యాచారాలకు సంబంధించి వసుంధరా రాజే ట్విట్టర్లో ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చారు. నిందితులను అరెస్టు చేయాలని, వారిని చట్టపరంగా శిక్షించాలని తాను డిజిపికి ఆదేశించానని, బాధితులకు న్యాయం చేస్తామని, నిందితులను అరెస్టు చేయడమే కాకుండా వారిని జ్యూడిషియల్ కస్టడీకి పంపించామని ట్వీట్ చేశారు.