బెంగళూరులో 'నిఫా' కలకలం: మూడు అనుమానిత కేసులు, ముగ్గురూ నర్సులే!
Recommended Video
బెంగళూరు: దేశమంతా ఇప్పుడు 'నిఫా' వైరస్ కారణంగా ఆందోళన చెందుతోంది. తాజాగా బెంగళూరులోనూ మూడు నిఫా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక కేసు సోమవారం నమోదవగా.. మరో రెండు మంగళవారం నమోదయ్యాయి. ఈ ముగ్గురూ నర్సులే కావడం గమనార్హం. ఇటీవల వీరు కేరళకు తరుచూ వెళ్లిరావడం వల్ల వారికి జ్వరం మొదలైందని వైద్యులు చెప్పారు.
ఈ ముగ్గురి పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ ని మణిపాల్ సెంటర్ ఫర్ రీసెర్చ్(ఎంసీవీఆర్)కి పంపించినట్టు తెలిపారు. ఆ రిపోర్టులు వస్తే గానీ వారికి నిఫా సోకింది లేనిది నిర్దారించడం కష్టం. ఈ ముగ్గురు నర్సులు బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది. నగరంలోని చాలా ఆసుపత్రుల్లో కేరళ నుంచి వచ్చిన నర్సులే పనిచేస్తున్నారని, వీరు తరుచూ వారి స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి నిఫా సోకిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'వాళ్లు కేరళ వెళ్లాక వారికి జ్వరం మొదలైంది. తిరుగు ప్రయాణంలో వాంతులు చేసుకున్నారు. ఇప్పటికైతే జ్వరం మాత్రమే ఉంది. అయినా ముందస్తు జాగ్రత్తతో బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ సెంటరుకు పంపించాం. చాలావరకు నిఫా నెగటివ్ వచ్చే అవకాశం ఉంది' అని డా. బీజీ ప్రకాశ్ కుమార్ తెలిపారు.