ఉల్ఫా కలకలం: ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అపహరణ
గౌహతి: అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం ముగ్గురు ఓన్జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్) ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. అస్సాం, నాగాలాండ్ సరిహద్దుల్లోని శివసాగర్ చమురు క్షేత్రంలో నుంచి వారిని యూఎల్ఎఫ్ఏ(ఐ)(ఉల్ఫా) మిలిటెంట్లు అపహరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఓఎన్జీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Recommended Video

లక్వా క్షేత్రం నుంచి ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల్ని గుర్తుతెలియని సాయుధులు బుధవారం కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన ముగ్గురిలో జూనియర్ టెక్నీషియన్లు ఎంఎం గొగొయ్, రితుల్ సైకియా, మరొకరు జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ అఖిలేష్ సైకియా ఉన్నారు.

కాగా, సంస్థకు చెందిన వాహనంలోనే దుండగులు వారిని అపహరించుకుపోయారు. ఆ తర్వాత వాహనం నిమోనాగఢ్ అటవీ ప్రాంతంలో లభ్యమైందని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. కిడ్నాప్ ఘటనపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సంస్థ తెలిపింది. ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించినట్లు వెల్లడించింది.
ఈ కిడ్నాప్ వెనుక ఉల్పా తీవ్రవాదుల హస్తం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు జిల్లా పాలనా విభాగం సీనియర్ అధికారి ఒకరు. అయితే, ఇది తమ ప్రాథమిక అంచనా అని తెలిపారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎవరి నుంచీ ఎలాంటి డిమాండ్లు రాలేదని తెలిపారు.
కాగా, గత ఏడాది డిసెంబర్లో, అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలోని ఇన్నావో సమీపంలో కుమ్చైకా హైడ్రోకార్బన్ డ్రిల్లింగ్ సైట్ నుండి క్విప్పో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఎన్ఎస్సిఎన్ (కె) కు చెందిన ఉల్ఫా (ఐ), మయన్మార్-వర్గం అపహరించాయి. వారిని ఏప్రిల్ నెలలలో విడుదల చేశాయి.
ఒఎన్జిసి భారతదేశపు అతిపెద్ద చమురు మరియు గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తి సంస్థ. ఈ సంస్థ 1960 ల ప్రారంభం నుండి ఎగువ అస్సాంలో చమురు మరియు వాయువును అన్వేషిస్తుంది మరియు ఉత్పత్తి చేస్తుంది.












Click it and Unblock the Notifications