ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ప్రపంచంలోనే ఎత్తైన క్లాక్ టవర్ నిర్మాణం
మైసూర్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన క్లాక్ టవర్ను దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిర్మించనుంది. ప్రపంచంలో అతిపెద్ద కార్పోరేట్ యూనివర్సిటీ ఉన్న కర్నాటకలో మైసూర్లోని 345 ఎకరాల్లో ఇన్ఫోసిస్కు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఈ క్లాక్ టవర్ను నిర్మిస్తున్నట్లు ‘ఇన్ఫోసిస్' ప్రతినిధులు ప్రకటించారు.
ఈ క్లాక్ టవర్ ఎత్తు 135 మీటర్లు. లండన్లోని బిగ్బెన్ (96 మీటర్లు), కాలిఫోర్నియాలోని హూవర్ టవర్ (87మీటర్లు), కార్నెల్లోని మెక్ గ్రా టవర్(53 మీటర్లు) కంటే త్వరలో నిర్మించనున్న ఈ టవర్ ఎక్కవ ఎత్తుని కలిగి ఉండనుంది.
ఇన్ఫోసిస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్లో గోతిక్ స్టయిల్లో, క్యాంపస్లోని ఇతర బిల్డింగ్ల కంటే ప్రత్యేక ఆకర్షణతో ఈ క్లాక్ టవర్ను నిర్మించనున్నారు. 19 ఫ్లోర్లతో నిర్మితమయ్యే ఈ క్లాక్ టవర్లోని 7వ అంతస్తులో బోర్డు రూమ్ ఉంటుంది. 22*22 మీటర్ల వ్యాసార్ధంలో ఇది నిర్మితం కానుంది.
ఈ క్లాక్ టవర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ. 60 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అవడానికి 20 నెలల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
క్లాక్ టవర్ లేకుండా ఇన్ఫోసిస్ మైసూర్ ట్రైనింగ్ అసంపూర్తిగా ఉందన్నారు. ఈ క్లాక్ టవర్ నిర్మాణం ఈ క్యాంపస్కు అకడమిక్ అనుభూతిని తీసుకొస్తుందన్నారు. అంతేకాదు ఈ క్యాంపస్కు క్లాక్ టవర్ ఎంతో ముఖ్యం కూడా అని చెప్పారు. ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ శిక్కా కూడా ఈ ప్రాజెక్టను అభినందించారన్నారు.
ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ నిర్మాణం చేసిన ముంబై ఆధారిత ఆర్కిటెక్ట్ హఫీజ్కే ప్రాజెక్ట్ బాధ్యతలను అప్పగించామన్నారు.