Timesnow C-Voter survey:తమిళనాడును స్వీప్ చేయనున్న డీఎంకే-కాంగ్రెస్ కూటమి
చెన్నై: తమిళనాడులో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. ఓవైపు భగభగ మండే ఎండలు మరోవైపు అంతే స్థాయిలో వేడెక్కుతున్న ఎన్నికలు వెరసి తమిళనాడు చాలా హాట్గా కనిపిస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితమే సర్వేల సందడి ప్రారంభమైంది. తాజాగా టైమ్స్నౌ - సీఓటర్ ఒపీనియన్ పోల్స్ సందడి చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే- కాంగ్రెస్ కూటమి సునాయాస విజయం దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వే జోస్యం చెప్పింది.
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి
తమిళనాడులో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. ఇక పార్టీలు పొత్తులు, వ్యూహాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రచారంలో కూడా జోరు సాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే మధ్యలో సర్వేలు ఎన్నికల హీట్ను మరింత పెంచేస్తున్నాయి. తాజాగా టైమ్స్నౌ సీఓటర్ ఒపీనియన్ పోల్స్ వెలువడ్డాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి 158 సీట్లలో విజయం సాధిస్తుందని సర్వే జోస్యం చెప్పింది. ఇక అన్నాడీఎంకే ఎన్డీయే కూటమి సీట్లు భారీగా పడిపోనున్నాయి. ఈ కూటమికి కేవలం 60 సీట్లు మాత్రమే వస్తాయని టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది.
2016 జయలలిత హవా ముందు డీఎంకే ఔట్
2016లో డీఎంకే పొందిన సీట్లకంటే ఈ సారి ఎన్నికల్లో గెలుపొందే సీట్లు రెట్టింపు అని చెప్పుకోవచ్చు. 2016 ఎన్నికల్లో అప్పుడు జయలలిత హవా ముందు డీఎంకే పాచికలు పారలేదు. దీంతో కేవలం 60 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జయలలలిత మరణం తర్వాత రెండాకుల పార్టీలో చీలికలు వచ్చాయి. ఇప్పుడు అన్నాడీఎంకే సీట్లు భారీ స్థాయిలో పతనం కావడానికి కారణం కూడా ఇదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీఎంగా స్టాలిన్కే మెజార్టీ ఓట్లు
ఇక ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుందన్న ప్రశ్నకు మెజారిటీ తమిళులు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్కు ఓటువేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తి ఎంకే స్టాలిన్ అంటూ ముక్తకంఠంతో తీర్పు చెప్పినట్లు టైమ్స్నౌ సీఓటర్ సర్వే వెల్లడించింది. పళని స్వామికి 31శాతం మద్దతు తెలుపగా స్టాలిన్కు 38.4శాతం, శశికళకు 3.9శాతం, కమల్ హాసన్కు 7.4శాతం, రజినీకాంత్కు 4.3శాతం, కేఎస్ అళగిరికి 1.7శాతం, పన్నీర్సెల్వంకు 2.6శాతం మంది మద్దతు తెలిపారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారా అన్న ప్రశ్నకు చాలా సంతృప్తిగా ఉన్నట్లు 12.07శాతం మంది తెలపగా, 22.28శాతం మంది కొంత వరకు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అస్సలు సంతృప్తిగా లేమని 53.26శాతం మంది చెప్పగా 12.39శాతం మంది చెప్పలేమని స్పష్టం చేశారు.
ఓట్లశాతంలో యూపీఏ టాప్
ఇక తమిళనాడులో ఓటుషేరును యూపీఏ 43.2శాతం దక్కించుకోనుండగా.. ఎన్డీయే 32.1 శాతం ఓటు షేరు మాత్రమే పొందనున్నట్లు సర్వే జోస్యం చెప్పింది. 2016 యూపీఏ ఓటు షేరు 39.4శాతంగా ఉంటే ఈ సారి 3.8శాతం మేరా ఓటు షేరును పెరగనుంది. ఇక ఎన్డీయే ఓటుషేరు 2016లో 43.7శాతంగా ఉండగా ఈ సారి అది 32.1శాతంకు పడిపోనున్నట్లు సర్వే వెల్లడించింది. ఇక తమిళనాడు ఎన్నికలు ఒకే విడతలో ఏప్రిల్ 6న జరగనుండగా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 6,28,23,749 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.