TMC Merger: టీఎంసీ రెబెల్స్ కు స్పీకర్ ట్విస్ట్..! మమతకు ఊరట..!
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు వ్యవహారం ఇప్పుడు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) కోర్టుకు చేరింది. ఇప్పటికే టీఎంసీకి ఉన్న 28 మంది లోక్ సభ ఎంపీల్లో 20 మంది ఎంపీలు రెబెల్స్ గా మారారు. వీరంతా స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. అయితే ఇది కుదరదని తేలడంతో త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అవుతామని కూడా ప్రతిపాదించారు. దీనిపై స్పీకర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడో అతిపెద్ద పార్టీ అయిన టీఎంసీలో చీలిక, విలీన ప్రక్రియల విషయంలో స్పీకర్ ఓం బిర్లా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తనను కలిసి ఎన్సీపీఐలో విలీనం అవుతామని సమాచారం ఇచ్చినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేందుకు మాత్రం స్పీకర్ ఇష్టపడటం లేదని సమాచారం. అందుకే ఇరు వర్గాల్ని సంప్రదించిన తర్వాతే తాను తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పేశారు. ఈ పరిణామం తిరుగుబాట్లతో సతమతం అవుతున్న టీఎంసీ బాస్ మమతా బెనర్జీకి ఊరటనిచ్చింది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఎంపీల బృందానికి స్పీకర్ కార్యాలయం ఈ-మెయిల్ పంపింది. లోక్సభ స్పీకర్తో సమావేశం కావాలని ఈ ఎంపీలను ఆహ్వానించారు. ఆ తర్వాతే అసమ్మతి వర్గానికి సంబంధించిన నిర్ణయాన్ని స్పీకర్ తీసుకుంటారు. ఇప్పటికే రెబెల్ ఎంపీలు తనను కలిసి ఎన్సీపీఐలో విలీనానికి ఆమోదం తెలపాలని స్పీకర్ కు లేఖ ఇచ్చారు. దీంతో అసలు టీఎంసీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి స్పీకర్ కార్యాలయం ఈ మెయిల్, మెసేజ్ కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈడీ విచారణకు హాజరైన సమయంలోనే ఇవి రావడంతో ఆయన చూసుకోలేదు. దీంతో మరో ఎంపీ కీర్తి అజాద్ కు ఫోన్ చేసి స్పీకర్ కార్యాలయ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

ప్రభుత్వ ఏజెన్సీల విచారణకు అభిషేక్ బెనర్జీ పూర్తిగా సహకరించాలని భావిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఈడీ విచారణలో ఉన్నందున నిన్న సాయంత్రం 4 గంటల సమావేశానికి హాజరు కాలేరని తెలియజేయడానికి కీర్తి ఆజాద్ స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తూ, సమావేశం కోసం వేరొక సమయం, తేదీని కోరారు. దీనిపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకుంటారు.















Click it and Unblock the Notifications