citizenship bill: బెంగాళీలకు దేశభక్తి నేర్పొద్దంటూ డెరెక్ ఓబ్రెయిన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెకె ఓబ్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు అంటే బెంగాళీలకు దేశ భక్తికి నేర్పించాలని చూడొద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ప్రజలందరూ తమకు దేశ భక్తి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. నిజమైన బెంగాళీ అంటే ఎవరో, నిజమైన దేశ భక్తులు ఎవరో తెలుసని అన్నారు. జాతీయవాదం, దేశ భక్తి గురించి తమకు చెప్పాల్సిన అవసరం లేదని డెరెక్ ఓబ్రెయిన్ స్పష్టం చేశారు. ఒకసారి చరిత్రను తిరిగిస్తే బ్రిటీష్ పాలనలో ఎంతమంది బెంగాళీలు ఉన్నారో తెలుస్తుందని టీఎంసీ ఎంపీ అన్నారు.

తమకు దేశ భక్తిని చెప్పడానికి మీరెవరు? అంటూ డెరెక్ ఓబ్రెయిన్ మండిపడ్డారు. నాజీ జర్మనీ, పౌరసత్వ బిల్లుకు మధ్యలో పొలికలున్నాయని అన్నారు. 84ఏళ్ల క్రితం నాజీ జర్మనీ ఎలాంటి చట్టాన్ని అయితే తెచ్చారో.. ఇప్పుడు అలాంటి చట్టమే తెస్తున్నారని ఆరోపించారు.
నియంతృత్వ సంకేతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీఎంసీ డెరెక్ ఓబ్రెయిన్ సూచించారు. బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. బిల్లు గురించి సువర్ణాక్షరాలతో రాయాల్సిన అవసరం లేదని.. జిన్నా సమాధిపై రాయాలని డెరెక్ ఓబ్రెయిన్ ఎద్దేవా చేశారు.
బీజేపీ అనేది మూడు 'జే'ల మీద ఆధారపడిందని.. మొదటి జే అంటే జూట్(అబద్ధం), రెండో జే అంటే జాన్సా(మోసం), మూడో జే అంటే జుమ్లా అని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో రెండు కోట్ల మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు.
కాగా, పౌరసత్వ బిల్లుపై దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదని, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 30 రోజుల సమయం కావాలని ప్రధాని మోడీ అడిగారని.. ఇప్పుడు దానిపై ఎలాంటి సమస్యల లేదని చెప్పారు. తమది హామీలిచ్చే ప్రభుత్వమే కాదు.. హామీలను అమలు చేసే ప్రభుత్వమని అమిత్ షా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications