Today in Parliament: ఓటీటీ ప్లాట్ఫామ్స్పై ఇష్టానుసారంగా యాడ్స్ సాగవిక: నియంత్రణ కోసం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవ్వాళ కొన్ని కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. క్రిప్టో కరెన్సీని నిషేధించడం, దాని స్థానంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన బిల్లు సభ ముందుకు రానుంది. తొలి రోజే దీన్ని ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ.. సాధ్య పడలేదు. ఇవ్వాళ దీన్ని కేంద్ర ప్రభుత్వం టేబుల్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే- ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్స్ను పర్యవేక్షించడానికి అవసరమైన కొన్ని మార్గదర్శకాలను రూపొందించే దిశగా ఓ ప్రకటన చేస్తుందని సమాచారం.
కేంద్రం శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబె, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, వాణిజ్యం-పరిశ్రమల శాఖ సహాయమంత్రులు అనుప్రియా సింగ్ పటేల్, సోమ్ ప్రకాష్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తమ శాఖలకు సంబంధించిన నివేదికలను సభకు సమర్పిస్తారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలు.. వాటిని అమలు చేసిన తీరును వివరిస్తారు.
వాణిజ్య ప్రకటనలను పర్యవేక్షించడానికి, వాటిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొన్ని మార్గదర్శకాలు సభ ముందుకు రానున్నాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్పై టెలికాస్ట్ అవుతోన్న అడ్వర్టయిజ్మెంట్లను నియంత్రించడానికి ప్రత్యేకంగా ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలంటూ ఈ స్టాండర్డ్స్ కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై ఉభయ సభల్లో ఇవ్వాళ చర్చ జరుగునుంది.
బొగ్గు కొరత అంశంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కిందటి నెలలో బొగ్గు కొరత వల్ల దేశవ్యాప్తంగా థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నెమ్మదించిన విషయం తెలిసిందే. దీనికి గల కారణాలను బొగ్గు మంత్రిత్వ శాఖ సభకు వెల్లడించనుంది. భవిష్యత్లో బొగ్గు కొరత రాకుండా ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆ శాఖ మంత్రి సభకు వివరిస్తారు. బొగ్గు కొరత వల్ల ఏ రాష్ట్రంలో ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి తగ్గిందనే విషయాన్ని స్పష్టం చేస్తారు.
Recommended Video
నకిలీ వార్తలను నియంత్రించడానికీ కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాళ సభకు తెలియజేస్తుంది. నకిలీ వార్తలను ఎలా గుర్తించాలి?, న్యూస్ ఛానళ్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలో అలాంటి వార్తలు వైరల్ కాకుండా ఎలా నియంత్రించాల్సి ఉంటుందనే విషయంపై ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంపై సభలో చర్చిస్తారు.