ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి చేర్చుకోవాల్సిందిగా ఆయనే చెప్పారు: నితీష్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం జేడీయూ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక సొంతంగా జరిగిందా లేక ఎవరైనా ఈ వ్యూహం వెనక ఉన్నారా అంటే... ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి తీసుకోవాల్సిందిగా అమిత్ షా తనకు సూచించినట్లు జేడీయూ ఛీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుండబద్దలు కొట్టారు.
రాజకీయ వారసుడిగా ప్రశాంత్ కిషోర్ను ప్రమోట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు నితీష్ కుమార్ సమాధానం ఇచ్చారు. పార్టీలోకి ప్రశాంత్ కిషోర్ను తీసుకోవాల్సిందిగా అమిత్ షా సూచించారని చెప్పారు. అలా ఒకసారి కాదని రెండు సార్లు అమిత్ షా తనతో చెప్పినట్లు నితీష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్కు రాష్ట్రంలోని యువత బాధ్యత అప్పగించామని అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువతను రాజకీయాలకు దగ్గర చేయాలని చెప్పినట్లు నితీష్ వివరించారు. ప్రశాంత్ కిషోర్ పట్ల తనకు అపార గౌరవం ఉందన్న నితీష్ కుమార్ తన రాజకీయవారుసుడు ఎవరనే ప్రశ్నను పక్కన బెడదామని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యదేశం అని రాచరిక పాలనలో లేమని వెల్లడించారు.
మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ తనపై పరుషపదజాలం వినియోగించినప్పటికీ ఆయనపై గౌరవం ఏమాత్రం తగ్గలేదని నితీష్ చెప్పారు. లాలూ ప్రసాద్తో కేవలం రాజకీయ విబేధాలు మాత్రమే ఉన్నాయని అతనితో ప్రత్యక్షంగా తనకు శతృత్వం లేదనే ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్. ఒక నాయకుడు ఎన్నికల్లో విజయం సాధించాడంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకే గెలిచినట్లు భావించాలని...వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ను చూసి గెలిపించరని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.