మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, లష్కరే తోయిబాకు ఊహించని దెబ్బ..
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్లకు మరో భారీ విజయం లభించింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ యాసిర్ను భద్రతా బలగాలు విజయవంతంగా మట్టుబెట్టాయి. మధ్య కశ్మీర్లోని బద్గామ్ జిల్లా, యూస్మార్గ్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో ఈ పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. లోయలో మళ్లీ రక్తపాతం సృష్టించేందుకు స్కెచ్ వేస్తున్న తరుణంలోనే సైన్యం అతడి ప్లాన్ను తిప్పికొట్టడంతో స్థానిక ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
యూస్మార్గ్ ఎత్తైన కొండ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఉగ్రవాదుల కదలికలపై భద్రతా సంస్థలకు పక్కా నిఘా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీకి చెందిన 53 రాష్ట్రీయ రైఫిల్స్, అత్యంత శిక్షణ పొందిన స్పెషల్ ఫోర్సెస్ విభాగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కనుచూపు మేర లేని దట్టమైన అటవీ ప్రాంతంలో సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన బలగాలు వెంటనే ప్రతిదాడికి దిగడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. అంతిమంగా లష్కర్ కమాండర్ యాసిర్ సైన్యం బుల్లెట్లకు బలయ్యాడు.

సులేమాన్ మూసా గ్రూప్తో లింకులు: ప్రత్యేక నెట్వర్క్తో కలకలం!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హతమైన యాసిర్ పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడిన రికార్డెడ్ టెర్రరిస్ట్. మొదట్లో లష్కరే తోయిబాకు చెందిన కీలకమైన 'సులేమాన్ మూసా' ముఠాలో కీలక సభ్యుడిగా పనిచేసిన యాసిర్, గత ఏడాది కాలంగా ఆ గ్రూప్ నుంచి విడిపోయి సొంతంగా నెట్వర్క్ నడుపుతున్నాడు. యూస్మార్గ్, బద్గామ్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతను రెచ్చగొడుతూ, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు బలగాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే అతడి కదలికలను నిరంతరం ట్రాక్ చేసి చివరకు పక్కా స్కెచ్తో అంతమొందించారు.
మూలాలను వెలికితీస్తున్న దర్యాప్తు సంస్థలు: కశ్మీర్లో కొనసాగుతున్న జల్లెడ!
కుఖ్యాత్ ఉగ్రవాది యాసిర్ అంతంతో ఈ ప్రాంతంలో లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే అతడి మృతి అనంతరం భద్రతా సంస్థలు విచారణను మరింత వేగవంతం చేశాయి. లోయలో అతనికి సహకరించిన స్థానిక నెట్వర్క్ ఎవరు? మిగిలిన లష్కర్ ఉగ్రవాదులతో అతడికి ఉన్న సంబంధాలు ఏంటి? ఇటీవలి కాలంలో కశ్మీర్లో జరిగిన దాడుల్లో అతడి పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగకుండా ఉండేందుకు కశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు గాలింపు చర్యలను మరింత తీవ్రతరం చేశాయి.














Click it and Unblock the Notifications