ఇంట్లో దూరిన ఉగ్రవాదులు: ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం, ఓ పౌరుడు మృతి
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య గురువారం తెల్లవారుజాము నుంచీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరుగుతున్న భీకర ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పడ్గంపొరా ప్రాంతంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య గురువారం తెల్లవారుజాము నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.
మరణించిన ఉగ్రవాదులను జహంగీర్ గని, ఎండీ.షఫి షేర్ గుజారీగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన వారిగా అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కొని ఉన్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, పుల్వామా భద్రతా సిబ్బంది రంగంలోకి దిగినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
మొత్తం ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు హతమవగా.. దాక్కొని ఉన్న మరో ఉగ్రవాదిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎన్కౌంటర్ కారణంగా బనిహాల్-బారాముల్లా, బనిహాల్- శ్రీనగర్ రైలు సర్వీసులను నిలిపేశారు. ఈ రైల్వేట్రాక్లు ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, గత నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో ఇది రెండో మేజర్ ఎన్కౌంటర్. పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది హతమార్చారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు మరణించగా, ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.