ఒమిక్రాన్ లెక్క తేలిందిగా: వ్యాక్సిన్ పని చేస్తుందనే గ్యారంటీ లేదు: లవ్ అగర్వాల్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. దేశంంలో విజృంభిస్తోంది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విస్తరిస్తోంది. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. మొదట్లో అదుపులో ఉన్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కట్టు తప్పినట్టే. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు రాబోతున్నందున.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ ప్రొటోకాల్స్ను పునఃసమీక్షిస్తోంది. కొత్త మార్గదర్శకాలను జారీ చేయడానికి కసరత్తు చేపట్టింది.
దేశంలో 11 రాష్ట్రాల్లో 101 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీని ప్రభావం రోజువారీ కరోనా వైరస్ లెక్కలపై పడట్లేదని చెప్పారు. 10 వేలకు దిగువగా కొత్త కేసులు నమోదు కావడం కొనసాగుతోందని, వారం రోజులుగా 0.65 శాతం మేర పాజిటివిటీ రేటు రికార్డవుతోందని అన్నారు. రోజువారీ పాజిటివ్ కేసుల్లో 40 శాతం కేరళ నుంచే వస్తోన్నాయని చెప్పారు.

కొద్దిసేపటి కిందటే ఆయన దేశ రాజధానిలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ కంటే వేగంగా విస్తరిస్తోందని లవ్ అగర్వాల్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న వ్యాక్సిన్లు.. ఒమిక్రాన్ వేరియంట్పై సమర్థవంతంగా పని చేస్తాయని ఇప్పుడే చెప్పలేమని తేల్చేశారు.
వ్యాక్సిన్లు.. ఈ వేరియంట్ను ఎదుర్కొంటాయనడానికి శాస్త్రీయబద్ధమైన వివరాలు లేవని లవ్ అగర్వాల్ చెప్పారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని స్పష్టం చేశారు. పండగలను పరిమిత సంఖ్యలో జరుపుకోవాలని, వీలైతే ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ప్రతి శాంపిల్నూ జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం ఏ మాత్రం సాధ్యం కాదని డాక్టర్ వీకే పాల్ చెప్పారు.
జీనోమ్ సీక్వెన్స్ అనేది మహమ్మారి తీవ్రతను అంచనా వేయడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని అన్నారు. డయాగ్నస్టిక్ కోసం వినియోగించలేమని పేర్కొన్నారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన మాత్రల గురించి ఆరా తీస్తోన్నామని, దీనికి సంబంధించిన డేటాను తెప్పించుకుంటున్నామని బలరాం భార్గవ అన్నారు. మాత్రలు.. కోవిడ్ను నివారిస్తాయని, యాంటీ బాడీస్ను పెంపొందిస్తాయనడానికి బలమైన సైంటిఫిక్ డేటా ఇంకా అందలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications