రామ మందిరం ట్రస్టుకు 9 నిబంధనలు.. సభ్యులకు నెల జీతాలు ఉండవన్న మోదీ సర్కార్
చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణం కోసం ''శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర'' పేరుతో ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మోదీ సర్కారు.. మొత్తం ప్రక్రియకు సంబంధించి ట్రస్టు ఎలా వ్యవహరించాలనేదానిపై తొమ్మిది కీలక నిబంధనలు పేర్కొంది. మొత్తం 15 మంది సభ్యులతో, సీనియర్ అడ్వొకేట్ పరాశరన్ చైర్మన్ గా ఉండే ట్రస్టును కేంద్ర హోం శాఖ ఇప్పటికే నోటిఫై చేయడంతో అయోధ్యలోని 67.7 ఎకరాల భూమిని ట్రస్ట్కు అందజేయనున్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, ఈ ట్రస్టు పూర్తిగా ఇండిపెండెంట్ గా పనిచేయనుంది. ఆ తొమ్మిది నిబంధనలు ఏవంటే..
Recommended Video
శాశ్వత కార్యాలయం
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుపై కేంద్రం పేర్కొన్న మొదటి నిబంధన.. దానికి శాశ్వత కార్యాలయం ఏర్పాటు. ట్రస్టు మొట్టమొదటి సమావేశంలోనే దీనిని నిర్ధారించాలి. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతం, ఆర్-20 భవంతిలో ట్రస్టు శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బిల్డింగ్ మరెవరిదోకాదు.. ట్రస్ట్ చైర్మన్, అయోధ్య కేసులో రామ్లలా, హిందూ పక్షాల తరఫున వాదించిన పరాశరన్ ఇల్లే.
అన్ని నిర్ణయాలు ట్రస్టువే
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబందించిన ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకునే పూర్తి స్వేచ్ఛ శ్రీరామ జన్మభూమి ట్రస్టుకు ఉంటుంది. భక్తుల కోసం వంటశాల, గోశాల, మ్యూజియం, సారై వంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
విరాళాల సేకరణ.. రుణాలు
రామ మందిరం ధర్మకర్తలుగా వ్యవహరించే ట్రస్టు సభ్యులు.. చట్టబద్దంగా విరాళాలు సేకరించొచ్చు. ఇతర గ్రాంట్లు, ఆస్తులు, వ్యక్తుల నుంచి సహాయం, సౌకర్యాలు కూడా పొందొచ్చు. అలాగే ఎవరి నుంచైనా లేదా సంస్థ నుంచైనా రుణాలు తీసుకునే అధికారాన్ని కూడా ట్రస్టుకు కల్పించారు.
సమావేశాలిలా..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ధర్మకర్తల మండలి.. 15 మందిలో ఒకరిని ప్రెసిడెంట్-మేనేజింగ్ ట్రస్టీగా నియమిస్తుంది. వారు సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని కూడా నియమిస్తారు.
నిధుల కోసం పెట్టుబడులు
అయోధ్య ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం అందుబాటులో ఉన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే అంశంపైనా తుది నిర్ణయం ట్రస్టుదే. ఆలయానికి సంబంధించిన పెట్టుబడులన్నీ ట్రస్టు పేరుమీదే ఉంటాయి.
వేరే పనికి వాడొద్దు
అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చే ప్రతిపైసాను ట్రస్టు పనులకే వాడాలితప్ప.. ఆ డబ్బును మరే ఇతర అవసరాలకు వాడరాదని హోం శాఖ నోటిఫికేషన్ లో ఆరో నిబంధనగా పేర్కొన్నారు.
అమ్మే హక్కు లేదు
అయోధ్యలో మందిరం కోసం ఏర్పాటైన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులోని ధర్మకర్తలు.. ట్రస్టుకు సంబంధించిన స్థిరాస్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించే హక్కు లేనేలేదు.
ఆడిట్ తప్పదు
దివ్య, భవ్య రామాలయానికి విరాళంగా అందే ప్రతి పైసానూ, అణా ఖర్చును కూడా ట్రస్టు ఖాతాల ద్వారానే జరపాలి. ఎప్పటికప్పుడు లెక్కలు పక్కాగా రాస్తూ బ్యాలెన్స్ షీట్లు రాసుకోవాలి. నిర్ణీత కాల వ్యవధిలో ట్రస్టు ఖాతాలను ఆడిట్ చేస్తారు.
జీతం ఉండదు
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో సభ్యులుగా ఉన్న 15 మందికీ ట్రస్టు ఖాతాల నుంచి ప్రత్యేకంగా నెల జీతం లాంటిదేదీ ఉండదు. అయితే సభ్యుల ప్రయాణాలు, ఇతరత్రా ఖర్చుల్ని మాత్రం ట్రస్టే చెల్లిస్తుంది.