పొంగల్ క్రీడల్లో తీరని శోకం: 'నాన్న.. నాన్న..' అంటూ పిల్లలు కేకలు వేస్తుండగానే..!
తగిన భద్రతా ఏర్పాట్లు చేయకుండా నిర్వహించిన ఈత పోటీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనతో తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారై గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
తంజావూరు జిల్లా పేరావురణి సమీపంలోని పెరియ తెర్కు కాడు గ్రామానికి చెందిన మణికంఠన్ (40) అనే వ్యక్తికి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. సంక్రాంతి (పొంగల్) పండుగ వేడుకల్లో భాగంగా ఆనైకాడు రోడ్డు ప్రాంతంలో క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో వినాయక ఆలయం వద్ద ఉన్న చెరువులో నిర్వహించిన ఈత పోటీలో మణికంఠన్ పాల్గొన్నాడు. పోటీ ప్రారంభమైన తర్వాత ఇతర క్రీడాకారులతో కలిసి మణికంఠన్ చెరువులో ఈదుకుంటూ వెళ్లాడు. అవతలి ఒడ్డును తాకి తిరిగి వస్తున్న సమయంలో, అతను అకస్మాత్తుగా నీటి అడుగున ఉన్న బురదలో చిక్కుకుని మునిగిపోయాడు. తోటి క్రీడాకారులు తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకున్నప్పటికీ.. మణికంఠన్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన స్థానిక యువకులు గాలింపు చేపట్టారు.

హృదయవిదారక దృశ్యం:
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, బురదలో చిక్కుకుని మృతి చెందిన మణికంఠన్ మృతదేహాన్ని వెలికితీశారు. తండ్రి గెలవాలనే ఆశతో చెరువు గట్టుపై నిలబడి "నాన్న.. నాన్న.." అంటూ ఉత్సాహపరిచిన ఆ చిన్నారులు, తండ్రి శవమై రావడం చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ దృశ్యం అందరినీ కలచివేస్తోంది.
కుటుంబ సభ్యుల డిమాండ్
చెరువు లోతును, బురదను గమనించకుండా, ఎటువంటి ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకుండా పోటీలు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ నిండు ప్రాణం పోవడమే కాకుండా, ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మణికంఠన్ కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించి, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని బంధువులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications