బెంగళూరులో వీడిన మిస్టరీ: CCTV ఫుటేజీలో..!!
బెంగళూరులో కేరళకు చెందిన ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు రైలు ఢీకొని మరణించిన ఘటన ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఇటీవలే బెంగళూరు శివార్లలోని చిక్కబానవార రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైలులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం పోలీసులు.. ఇది ఆత్మహత్య అయి ఉండవచ్చని భావిస్తోన్నారు. ఎందుకు వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు.
మృతులు 19 ఏళ్ల స్టెర్లిన్ ఎలిస్, 20 ఏళ్ల జస్టిన్ జోసెఫ్. చిక్కబానవారలో గల సప్తగిరి మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు. వీరిద్దరూ మంచి స్నేహితులు. గత ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో చిక్కబానవార రైల్వే స్టేషన్ వద్ద బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొని వీరిద్దరూ మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించారు. పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని మరణించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్ష్యులు కూడా అదే తరహాలో వాంగ్మూలాన్ని ఇచ్చారు. స్టెర్లిన్ ఎలిస్, జస్టిన్ జోసెఫ్ పట్టాల పక్కన నడుస్తుండటాన్ని చూశామని తెలిపారు. ఊహించనంత వేగంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ దూసుకుని రావడంతో వారికి తప్పుకోవడానికి సమయం దొరకలేదని చెప్పారు. దీంతో ప్రమాదంగా కేసు నమోదు చేశారు పోలీసులు.
తమ దర్యాప్తులో భాగంగా బెంగళూరు రూరల్ రైల్వే పోలీసుల సహకారంతో వారిని ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారు ఉద్దేశపూరకంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ముందుకు వెళ్లినట్లు తేలింది. రైలు ఢీకొట్టడానికి ముందు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు ఇది ఆత్మహత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
సంఘటనా స్థలంలో ఆత్మహత్య లేఖ గానీ, ఇతర ఆధారాలు గానీ లభించలేదని తాజాగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో దొరికిన మొబైల్ ఫోన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బెంగళూరు రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్లో అన్ నేచురల్ డెత్ రిపోర్ట్ గా కేసు నమోదు చేశారు. యశ్వంత్పూర్ రైల్వే పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications