జియో ఉచిత ఆఫర్లతో వచ్చే నష్టమేమీ లేదు: మద్దతిచ్చిన ట్రాయ్
రిలయన్స్ జియో ప్రమోషనల్ ఆఫర్ల వల్ల టెలికాం ఇండస్ట్రీ ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని ట్రాయ్ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో లాంటి టెలికాం సంస్థలు అందించే ప్రమోషనల్ ఆఫర్ల వల్ల టెలికాం ఇండస్ట్రీ ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టం చేసింది.
గత నెల టెలికాం కమిషన్ ఆదేశాలకు స్పందించిన ట్రాయ్ ఈ మేరకు ఓ డ్రాఫ్ట్ నోట్ ను రూపొందించింది. టెలికాం కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ల వల్ల పరిశ్రమ ఆర్థిక సంపదకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు తగ్గుతాయని టెలికాం కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
రిలయన్స్ జియో వెల్ కమ్ ఆఫర్, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద ఉచిత వాయిస్, డేటా ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఆఫర్లు ఫైనాన్షియల్ సెక్టార్ కు తీవ్ర దెబ్బకొడతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ టెలికాం సెక్రెటరీ జేఎస్ దీపక్ అధినేతగా ఉన్న టెలికాం కమిషన్ ట్రాయ్ కి ఓ లేఖ రాసింది.
ఈ ప్రమోషనల్ ఆఫర్లపై పున:సమీక్షించాలని టెలికాం కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉచిత ఆఫర్లు, ప్రమోషనల్ ఆఫర్ల వల్ల టెలికాం పరిశ్రమ సంపదకు ఎలాంటి హానీ ఉండదని ట్రాయ్ పేర్కొంది.
టారిఫ్, టారిఫ్ ఆర్డర్ల బాధ్యతలన్నీ ట్రాయ్ పరిధిలోకే వస్తాయి. టెలికాం సెక్టరా్ ను ప్రమోట్ చేస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ట్రాయ్ బాధ్యత అని, వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూ.. మార్కెట్ ను అభివృద్ధి చేయాలనేది ట్రాయ్ యాక్ట్ లో స్పష్టం గా ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
దీని కింద రిలయన్స్ జియోకు ఇచ్చిన అనుమతిని ట్రాయ్ పూర్తిగా సమర్థించుకుంటోంది. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కూడా ట్రాయ్ కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.