Ayodhya Verdict: కీలక తీర్పిచ్చారు.. వారికి సీజేఐ విందు-విశ్రాంతి, ఎక్కడంటే?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శనివారం చారిత్రక అయోధ్య భూ వివాదం కేసులో తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ న్యాయమూర్తులు కొంత విశ్రాంతి తీసుకుంటున్నారు.

ధర్మాసనం సభ్యులకు సీజేఐ విందు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తన సహచర న్యాయమూర్తులైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్లకు శనివారం సాయంత్రం విందు ఇవ్వనున్నారు . ఈ విందు తాజ్ మాన్సింగ్ హోటల్లో జరగనుంది.

చారిత్రక కేసులో తుది తీర్పు కోసం..
అయోధ్య కేసులో తుది తీర్పు ఇచ్చేందుకు ఈ న్యాయమూర్తులు గత కొన్ని రోజులుగా విరామం లేకుండా శ్రమించారు. అందుకే వారికి కొంత విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన సహచరులకు విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

40రోజులపాటు వాదనలు...
అంతేగాక, జస్టిస్ రంజన్ గొగొయ్ త్వరలో ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అక్టోబర్ 16 నుంచి అయోధ్య భూ వివాదం కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత 40 రోజులుగా వాదనలు వింటూనే ఉంది.

దశాబ్దాల నాటికేసుకు పరిష్కారం..
శనివారం ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య భూ వివాదం కేసులో ఏకగ్రీవ తీర్పు ఇవ్వడం గమనార్హం. అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మసీదు నిర్మించుకునేందుకు ముస్లింలకు అయోధ్యలోనే వేరే ప్రాంతంలో 5 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను 3 నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications