మరో వందే భారత్ ఎక్స్ప్రెస్.. 8 బోగీలే: హాల్ట్ స్టేషన్లు, ప్రత్యేకతలు ఇవే
బెంగళూరు: మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కబోతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 27వ తేదీన ఈ రైలు రాకపోకలు సాగించబోతోంది. పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. బెంగళూరు- ధార్వాడ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ఇవ్వాళ చేపట్టారు అధికారులు.
ఈ తెల్లవారు జామున 5:45 నిమిషాలకు క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి ధార్వాడకు బయలుదేరి వెళ్లింది. మధ్యాహ్నం 12:40 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా బెంగళూరు సెంట్రల్ స్టేషన్లో రైల్వే అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి ట్రయల్ రన్ను ప్రారంభించారు.

మధ్యాహ్నం 1:15 నిమిషాలకు మళ్లీ ధార్వాడ నుంచి బెంగళూరుకు బయలుదేరుతుంది. రాత్రి 8:10 నిమిషాలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్కు చేరుకుంటుంది. ఎనిమిది కోచ్లు ఉండే మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇది. క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు గదగ్, హుబ్బళ్లి మీదుగా ధార్వాడకు చేరుకుంటుంది.
ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం సుమారుగా 12 గంటలు. వందే భారత్ వల్ల ఏడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కర్ణాటకలో రాకపోకలు సాగించే రెండో వందే భారత్ ఇదే అవుతుంది. ఇదివరకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బెంగళూరు మీదుగా మైసూరుకు తొలి రైలును నడిపిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ ఎక్స్ప్రెస్ కోసం నైరుతి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బెంగళూరు- ధార్వాడ మధ్య పట్టాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేశారు. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లు రాకపోకలు సాగించేలా ట్రాక్ సామర్థ్యాన్ని ఆధునికీకరించారు. బెంగళూరు- ధార్వాడ మార్గంలో 90 శాతం పట్టాల ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయయి నైరుతి రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 489 కిలోమీటర్లు. ఇందులో 386 కిలోమీటర్ల మేర పట్టాల సామర్థ్యాన్ని పెంచారు. ఈ మార్గంలో తిరుగాడే రైళ్లు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తీర్చిదిద్దారు. జులై నాటికి మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ట్రయల్ రన్ సందర్భంగా ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని వివరించారు.
ఈ నెల 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా అయిదు వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. బెంగళూరు- ధార్వాడతో పాటు పాట్నా-రాంచీ, గోవా- ముంబై, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్ మధ్య నడిచే ఈ అయిదు రైళ్లు ఒకేసారి పట్టాలెక్కనున్నాయి. మేకిన్ ఇండియా విధానానికి భాగంగా ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు.












Click it and Unblock the Notifications