తృణమూల్ కు బిగ్ ఝలక్: ఎంపీ రాజీనామా: పార్టీ సభ్యత్వానికీ గుడ్ బై
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఆయనకు సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికీ గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తన నిర్ణయాన్ని తెలియజేస్తూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు.

కొద్దిసేపటి కిందటే ఆయన రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ నేరుగా కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పార్లమెంటు ఎగువ సభ నుంచి తప్పుకోవడమే కాకుండా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన దూరమయ్యారు. తృణమూల్ లో అత్యంత సీనియర్ అయిన సుఖేందు శేఖర్ రాయ్ ఇలా అకస్మాత్తుగా తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రత్యేకించి.. తృణమూల్ అంతర్గత కుమ్ములాటను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీని మరింత ఇరకాటంలో పడేసింది.
ఢిల్లీలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం జరుగుతుండగా, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ జాతీయ స్థాయి చర్చల కోసం అక్కడికి చేరుకున్నారు. కూటమిని బలోపేతం చేసే క్రమంలో పార్టీ అగ్రనేతలు బిజీగా ఉన్న సమయంలో.. సుఖేందు రాయ్ ఇలా పార్టీని వీడటం తృణమూల్ నాయకత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. ఎమ్మెల్యేల అసంతృప్తి తర్వాత, ఎంపీల స్థాయిలో కూడా మమతా బెనర్జీకి దేశ రాజధాని వేదికగా ఎదురుదెబ్బ తగలడం పార్టీలో గందరగోళానికి దారితీసింది.
బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేపథ్యంలో, ఎంపీల స్థాయిలోనూ ఈ పరిణామం చోటుచేసుకుంది. అసంతృప్త నేతలు ఈ తిరుగుబాటును అనధికారికంగా 'ఆపరేషన్ క్రౌన్ ప్రిన్స్' అని పిలుస్తున్నారు. ఇది అభిషేక్ బెనర్జీ పెరుగుతున్న రాజకీయ ఆధిపత్యాన్నే లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేల ఉపనేత సందీపన్ సాహా దీనిని ధృవీకరించారు కూడా. అభిషేక్ బెనర్జీ ఏకపక్ష ధోరణి దీనికి కారణమని ఆరోపించారు.












Click it and Unblock the Notifications