ఫత్వా లెక్కచేయని నుస్రత్ జహాన్ జగన్నాథ రథయాత్రలో సందడి.. జై జగన్నాథ్ అని నినదించిన ‘దీదీ’
కోల్కతా : తనకు జాతి, మత, ప్రాంత విభేదాలు లేవని స్పష్టంచేసిన సినీనటి, టీఎంసీ నుస్రత్ జహన్ చెప్పినట్టే చేశారు. గురువారం ఇస్కాన్ చేపట్టే రథయాత్రలో పాల్గొంటానని ప్రకటించి .. పాల్గొన్నారు. అయితే రథయాత్రలో టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొనడం విశేషం. జగన్నాథుడి రథయాత్రలో నేతలు పాల్గొనడం మత రాజకీయరంగు కూడా పులుముకుంది.
రథయాత్రలో ..
తాను భారతీయురాలినని ఇదివరకే నుస్రత్ స్పష్టంచేశారు. తనకు జాతి, మతం, ప్రాంతీయ విద్వేషాలు లేవని పేర్కొన్నారు. నుష్రత్ జహన్ ముస్లిం. కానీ ఇటీవల టర్కీలో నిఖిల్ జైన్ను పెళ్లిచేసుకున్నారు. తర్వాత నుదట కుంకుమ, మాంగళ్యధారణ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఆమె 2017లో జరిగిన రథయాత్రలో కూడా పాల్గొన్నారు. కానీ పెళ్లైన తర్వాత రథయాత్రలో పాల్గొనడంతో వివాదం చెలరేగింది. దీనిపై ఆమె బాహటంగానే తన ఉద్దేశాన్ని మీడియాకు వివరించారు. ఈ సందర్భంలో కోల్కతాలోని ఇస్కాన్ ఆలయంలో రథయాత్రలో పాల్గొన్నారు. ఆమెతోపాటు సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పూరీలోని జగన్నాథుడి క్షేత్రంలో రథయాత్ర కన్నులపండువగా సాగుతుంది.
జై జగన్నాథ్ ..
నుష్రత్తోపాటు ఇస్కాన్ ఆలయానికి వచ్చిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చారు. ఈ సందర్భంగా జై జగన్నాథ్ అని నినాదాలు చేశారు. ఇటీవల బీజేపీ నేతలు జై శ్రీరాం, జై హనుమాన్ అనాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా స్పందించలేదు. తాను జై శ్రీరాం అనబోమని .. జై హింద్ అని మాత్రమే అంటానని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తర్వాత మమతతో మోడీ, షా సై అంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి వ్యతిరేకంగా మమత కౌంటర్ వేస్తున్నారు. అయితే ఇవాళ జై జగన్నాథ్ అని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
వివాదాస్పదం ..
నుష్రత్ జహన్ ఇటీవల పార్లమెంట్కు హిందువులా రావడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆమె కుంకుమ పెట్టుకొని, గాజులు వేసుకొని రావడం ఏంటని ముస్లిం మత పెద్ద ప్రశ్నించారు. నమాజ్ చదివే నుష్రత్ .. జైన్ను పెళ్లిచేసుకొని హిందువులా కనిపించడం ఏంటని ప్రశ్నించారు. మత పెద్ద ఆరోపణలను బీజేపీ మరో ఎంపీ సాద్వీ ఖండించారు. తనకు కుల, మతాలంటే పట్టింపులేదన్న నుష్రత్ను అభినందించాల్సింది పోయి .. విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.