ట్రిపుల్ తలాక్ బిల్లు మళ్లీ వెనక్కి..వచ్చే సమావేశాల్లోనే బిల్లు
ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ముందుకు వస్తుందని అంతా భావించినా... ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును ఈ సమావేశాల్లో పెట్టేందుకు అంగీకారం తెలపలేదు. శుక్రవారంతో శీతాకాల సమావేశాలు ముగిశాయి.ఇక బిల్లు తిరిగి వచ్చే సమావేశాల్లోనే రాజ్యసభ ముందుకు వస్తుంది.
గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మూడు అమెండ్మెంట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల బిల్లు 2017లో ఒక సవరణ చేయాలని కేంద్రం భావించింది. ట్రిపుల్ తలాక్ కేసులో శిక్ష పడ్డ పురుషులకు బెయిల్ లభించేలా సవరణ చేయాలని కేంద్రం భావించింది. అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో గతేడాది ఆమోదం పొందింది. అయితే కొన్ని మార్పులు చేరుస్తున్నారు కనుక బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందాల్సి ఉంది.
ట్రిపుల్ తలాక్ బిల్లు ఇంకా రాజ్య సభలో ఆమోదం పొందకపోవడం వల్ల ప్రస్తుతం ఏదైతే ట్రిపుల్ తలాక్ కేసులో మూడు సంవత్సరాల శిక్ష ఉంటుందో అదే కొనసాగుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.అంతేకాదు ఇది నాన్ బెయిలబుల్గానే చూస్తామని అధికారులు తెలిపారు. అయితే నిందితుడు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని మాత్రం వారు వివరించారు. భార్యకు భరణం ఇచ్చేందుకు భర్త ఒప్పుకుంటేనే జడ్జీ బెయిల్ మంజూరు చేసేలా చట్టంలో ఉందని అన్నారు. చట్టప్రకారమే భర్తకు జడ్జీ శిక్ష విధిస్తారని అది బిల్లులో పొందుపర్చి నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు భార్య వాదనలు విన్న తర్వాతే బెయిల్ మంజూరుపై జడ్జీ నిర్ణయం తీసుకోవాలనే సవరణ బిల్లులో చేర్చినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇలా చేర్చాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.