త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్కు కరోనా కాటు -హోం ఐసోలేషన్ -ఇటీవలే ‘స్వయం ప్రతిపత్తి’ ఎన్నికలో పాల్గొని..
విచిత్ర, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల త్రిపురలోని స్వయంప్రతిపత్తి జిల్లాల మండళ్ల(ఏడీసీ)కు జరిగిన ఎన్నికల్లో విస్తృతంగా తిరిగిన ఆయనకు బుధవారం నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటిగా తేలింది.
తాను కరోనా బారిన పడిన విషయాన్ని సీఎం బిప్లబ్ స్యయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్టు చెప్పారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.

త్రిపురలో తొలి నుంచీ కరోనా వైరస్ అదుపులోనే ఉంటూ వస్తున్నది. ఇప్పటివ వరకు అక్కడ 33,551 కేసులు మాత్రమే నమోదుకాగా, 33,068 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 389 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 71గా ఉంది. ఏడీసీ ఎన్నికల సందర్భంలో భారీ సభలు జరగడంతో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతోందనే అనుమానాలు పెరిగాయి.
జమ్మూకాశ్మీర్ లో రద్దయిన ఆర్టికల్ 370కి దగ్గరగా ఉండే ఆర్టికల్ 371 పలు ఈశాన్య రాష్ట్రాల్లో అమలవుతుండటం తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(2), ఆర్టికల్ 275(1) ప్రకారం త్రిపురలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జిల్లాలు, ప్రాంతాలు కొనసాగుతుండగా, ఆయా మండళ్లకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 76శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సమర్థించిన అభ్యర్థుల గెలుపు కోసం సీఎం బిప్లబ్ దేవ్ ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications