ఆ కమిటీలో నేనుండను: మోడీకి సీఎం మాణిక్ సర్కార్ షాక్
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కేంద్రానికి షాకిచ్చారు.
న్యూఢిల్లీ/అగర్తాల: త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కేంద్రానికి షాకిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలను డిజిటల్ రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన సూచనలు చేసే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బృందంలో తాను ఉండబోనని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ తేల్చి చెప్పారు.
సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆయనకు ఫోన్ చేశారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కమిటీలో ఉండాలని, నగదురహిత లావాదేవీలు జరిపేందుకు తగు సూచనలు చేయాలని జైట్లీ కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై తాను సుముఖంగా లేనని సర్కార్ స్పష్టం చేశారు.
ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని మాణిక్ సర్కార్ అభిప్రాయపడ్డారు.
కొత్త నగదు ఏర్పాటుకు ఏటీఎంలను సిద్ధం చేసేవరకు, ప్రజలకు చిల్లర కష్టాలు తీరేంతవరకు పాత రూ.500, రూ.1000నోట్లు చెలామణి చేసుకునేందుకు అనుమతించాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.ః
కాగా, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతో కమిటీ వేసి వారి సూచనల ప్రకారం ఆర్థిక లావాదేవీలను డిజిటల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.