ప్రశాంత్ కిషోర్ IPAC టీమ్ నిర్బంధం -కీలక నేత కోసం సర్వే చేస్తుండగా పోలీసుల అడ్డగింత, రచ్చ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థకు చేదు అనుభవం ఎదురైంది. ముందస్తు సర్వేకు వెళ్లిన ఐప్యాక్ టీమ్ సభ్యులను పోలీసులు అడ్డగించారు. పీకే టీమ్ బస చేసిన హోటల్ ను చుట్టుముట్టిన పోలీసులు.. వారిని ఎటూ కదలనీయకుండా చేశారు. కొవిడ్ నిబంధనల వేళ కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానంతోనే నిర్బంధించామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. వివరాలివి..

అగర్తలలో పీకే టీమ్ సర్వే
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. దేశంలోనే బలమైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి మమతా బెనర్జీ మూడోసారి సీఎం కావడంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికల తర్వాత షెఫాలజిస్ట్ వృత్తి నుంచి తప్పుకుంటానని పీకే ప్రకటించినప్పటికీ, ఆయన నెలకొల్పిన ఐప్యాక్ మాత్రం పాత కమిట్మెంట్లను నిర్వర్తిస్తున్నది. పంజాబ్ లో కాంగ్రెస్ తరఫున పీకే స్వయంగా రంగంలోకి దిగగా, 2023లో త్రిపురలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన బృందం అగర్తలలో సర్వే చేపట్టింది. ఈ క్రమంలో..

కరోనా భయం.. హోటల్లో నిర్బంధం
2023లో జరగబోయే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పనిచేస్తోన్న ఐప్యాక్ బృందం.. ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభావాన్ని అంచనా వేసేందుకు, అవసరమైన గ్రౌండ్ వర్క్ సేకరించేందుకు తాజాగా సర్వే చేపట్టింది. అందులో భాగంగా 23 మంది సభ్యులు అగర్తలలోని ఓ హోటల్ లో మకాం వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు భారీగా హోటల్ కు చేరుకుని, పీకే టీమ్ సభ్యులను గదుల్లోనే నిర్బంధించారు. అగర్తలతోపాటు త్రిపుర అంతటా కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయిని, కొత్త వ్యక్తుల కదలికపై నిఘా ఉందని, ఐప్యాక్ టీమ్ సభ్యులకు కొవిడ్ టెస్టులు చేశామని, రిపోర్టులు రాగానే వారిని విడిచిపెడతామని త్రిపుర పోలీసులు చెప్పారు. కాగా,

ఐప్యాక్ టీమ్ నిర్బంధంపై రచ్చ
త్రిపుర పోలీసులు చెబుతున్నట్లు తాము కొవిడ్ రూల్స్ అతిక్రమించలేదని, సభ్యులంతా ఇప్పటికే టీకాలు తీసుకున్నామని ఐప్యాక్ ప్రతినిధులు వాదిస్తున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. త్రిపుర పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. మా బెంగాల్ లో బీజేపీ ఓటమిని చూసి భయపడుతోందని ట్వీట్ చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ సర్కారు ఐప్యాక్ టీమ్ ను హౌస్ అరెస్ట్ చేసిందని, వారిని వెంటనే విడుదల చేయాలనీ ఆయన అన్నారు. బీజేపీ అపసవ్య పాలనకు ఇదొక ఉదాహరణ అని త్రిపుర టీఎంసీ చీఫ్ ఆశిష్ లాల్ సింఘాల్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications