ఆ రాష్ట్రం..హింసాత్మకం: పోలీస్స్టేషన్లో మహిళా నేతపై బీజేపీ ప్రాణాంతక దాడి: సుప్రీంలో పిటీషన్
అగర్తల: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వర్గానికి చెందిన వారిపై దాడులు కొనసాగుతున్నాయి. భౌతికదాడులకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. వారి ఇళ్లు, దుకాణాలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తోన్నారు. ప్రార్థనా మందిరాలపైనా దాడులు చోటు చేసుకున్నాయి. ఒక వర్గానికి చెందిన దుకాణాలు, ఇళ్లను లూటీలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది కాస్తా మరింత ముదిరింది. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయి.
తాజాగా- భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు తమ రాజకీయ ప్రత్యర్థులపై అమానవీయకరంగా దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు యథేచ్ఛగా కొనసాగినట్లు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కార్యకర్తలపై అమానవీయకరంగా ఈ దాడులు సాగాయనే ఆరోపణలు బీజేపీ నాయకుల మీద ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సయ్యోనీ ఘోష్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆమెపై దాడి చేుయడానికి పోలీస్ స్టేషన్కు చేరారనే ఆరోపణలు ఉన్నాయి.
పోలీస్ స్టేషన్తో పాటు అగర్తలా భగవాన్ ఠాకూర్ చౌముని ప్రాంతంలో గల తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ స్టీరింగ్ కమిటీ చీఫ్ శుభల్ భౌమిక్ నివాసంపైనా బీజేపీ నాయకులు దాడులు చేశారు. నివాసాన్ని ధ్వంసం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్రిపుర స్టేట్ రైఫిల్స్కు చెందిన సిబ్బందిని అక్కడ మోహరింపజేసింది. కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. ఈ దాడులును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అగర్తలాకు చేరుకున్నారు. బీజేపీ దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఈ హింసాత్మక పరిస్థితులన్నింటినీపైనా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బీజేపీ నాయకులు తమపై దాడులు చేస్తూ.. తమపైనే ఎదురు కేసులు, తప్పుడు కేసులను నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సయ్యోని ఘోష్పై పోలీస్ స్టేషన్లోనే ప్రాణాంతక దాడి చోటు చేసుకుందని, పోలీసుల సమక్షంలోనే బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను మంగళవారం నాటికి వాయిదా వేసింది. కొద్దిరోజులుగా త్రిపురలో హింసాత్మక పరిస్థితులు నెలకొంటూ వస్తోన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులకు చెందిన వారి ఆస్తులు, ప్రార్థనా మందిరాలపై దాడులు చోటు చేసుకుంటోన్న ఉదంతానికి ప్రతీకారంగా త్రిపురలో ప్రతిదాడులు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఒక వర్గంపై చోటు చేసుకుంటోన్న ఈ హింసాత్మక దాడుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత కొన్ని రోజులుగా, వీహెచ్పీ, హిందూ జాగరణ వేదిక వంటి సంస్థలు అగర్తలతో పాటు ఇతర జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో నిరసనలు నిర్వహించాయని, ఆ సమయంలో- ఈ దాడులు సంభవించాయనే విమర్శలు ఉన్నాయి. కృష్ణా సాగర్, ధర్మానగర్, పణిసాగర్, చంద్రాపూర్ లలోనూ ఇలాంటి దాడుల ఘటనలు నమోదయ్యాయి. నార్త్ త్రిపుర జిల్లాలోని పణిసాగర్లో మసీదుపై దాడులు చోటు చేసుకున్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై తాము వెంటనే స్పందించామని ప్రభుత్వం చెబుతోంది.