నటి శిల్పాకి చిక్కు: నోటీసులు పంపిన ప్రొడక్షన్ హౌస్
న్యూఢిల్లీ: ప్రముఖ నటి శిల్పా షిండే పాపులర్ కామెడీ షో 'బాభీ జి ఘర్ పర్ హై' నుంచి తప్పుకుంది. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తప్పుకుంది. అయితే, ప్రొడక్షన్ హౌస్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించింది.
కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ 28 ఏళ్ల నటి శిల్పా ఆ కామెడీ షోలో అంగూరీ బాబీగా నటిస్తోంది. ఇతర షోలలో నటించకుండా, కేవలం ఇక్కడే పని చేయాలనే అభిప్రాయంతో ఓ కాంట్రాక్టు పైన సంతకం చేయాలని వారు ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపిస్తోంది.
ఇలాంటి మరో కార్యక్రమం కోసం ఒప్పందం కుదుర్చుకోరాదని ప్రొడక్షన్ హౌస్ చెప్పిందని, నా కెరీర్తో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నిస్తోంది. నేను మీకు 25 రోజులు సమయం ఇస్తున్నానని, మిగతా సమయంలో నేను ఇతర షోలు చేసుకుంటే మీకు ఇబ్బంది ఏమిటని ఆమె ప్రశ్నించింది.
ఇతర షోలలో నటించకుండా ఉండే వారి అగ్రిమెంటు పైన తాను సంతకం చేయలేదని చెప్పింది. తన పైన ఇప్పుడు అసత్యాలు వారు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. తనను మానసికంగా వేధిస్తున్నారని చెప్పింది. కాగా, ఈ షో కోసం శిల్పా మరింత ఎక్కువ మొత్తం డిమాండ్ చేసిందని, అలాగే తనకు సొంత డిజైనర్లు కావాలని కోరిందని వార్తలు వినిపిస్తున్నాయి.