ప్రెసిడెంట్ ట్రంప్కు ప్రధాని మోదీ ఇవ్వబోయే స్పెషల్ గిఫ్టులు ఏంటో తెలుసా?
ప్రస్తుతం ప్రపంచం కళ్లన్నీ అమెరికా అధ్యక్షుడి భారత పర్యటనపైనే. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం-అతిపురాతన ప్రజాస్వామిక దేశం కలయికగా అభివర్ణిస్తోన్న ఈ పర్యటనపై రెండు ప్రభుత్వాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇండియాతో ట్రేడ్ డీల్ పై అమెరికా ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి ట్రంప్.. వాషింగ్టన్ డీ సీ నుంచి నేరుగా ఈనెల 24న అహ్మదాబాద్ లో ల్యాండవుతారు. మొదటిగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న ఆయనకు ప్రత్యేక గిఫ్టులు అందజేయబోతున్నట్లు ట్రస్టీలు తెలిపారు.

ఇవే ఆ గిఫ్టులు..
జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని అమెరికా అధ్యక్షుడు సందర్శించడం తొలిసారి కావడంతో ట్రంప్ కు మర్చిపోలేని బహుమతుల్ని ఇవ్వబోతున్నట్లు సబర్మతి ఆశ్రమ ట్రస్టీ అమృత్ మోదీ మంగళవారం మీడియాకు వెల్లడించారు. నూలు వడికే చెరఖా నమూనా, మహాత్ముడి జీవితానికి సంబంధించిన రెండు పుస్తకాలు, ఒక చిత్రపటాన్ని ట్రంప్ కు గిఫ్టుగా ఇవ్వనున్నట్లు అమృత్ మోదీ చెప్పారు. ఆ రెండు పుస్తకాల్లో ఒకటి గాంధీజీ ఆత్మకథ ‘మై లైఫ్ మై మెసేజ్' ఒకటని తెలిపారు.

గాంధీజీ గదిలోకి..
సబర్మతి ఆశ్రమానికి వచ్చీ రాగానే ట్రంప్, ఆయన భార్య మెలానియాలకు నూలు దండలతో స్వాగతం పలుకుతామని ట్రస్టీలు తెలిపారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ-కస్తూర్బాలు కలిసి జీవించిన కాటేజీ(హృదయ్ కుంజ్)లోపలికి ట్రంప్, మెలానియా వెళతారని, గాంధీజీ స్వహస్తాలతో నూలు వడికిన చెరఖాను కూడా తాకనున్నారని సమాచారం. ఈ పర్యటన ఆద్యంతం అతిథుల వెంట ప్రధాని మోదీ కూడా ఉండనున్నారు.

నమస్తే ట్రంప్..
హ్యూస్టన్ లో ‘హౌడీ మోదీ'తరహాలో అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్' కర్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు షోతోపాటు నమస్తే ట్రంప్ ఈవెంట్లకు కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈనెల 24న అహ్మదాబాద్ లో 3 గంటలు గడపనున్న ట్రంప్.. తర్వాత ఢిల్లీకి వెళతారు. 25న రాష్ట్రపతిని కలిసి, మరోసారి మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాల్ని చర్చిస్తారు.












Click it and Unblock the Notifications