వీరప్పన్ వ్యాఖ్య: నటి సుకన్యకు 10లక్షలు చెల్లించాలని టీవీకి కోర్టు
చెన్నై: ప్రముఖ తమిళ నటి, నిన్నటి తరం హీరోయిన్ సుకన్యకు పది లక్షల రూపాయలు చెల్లించాలని ప్రముఖ టీవీ ఛానల్ సన్ టీవీని శుక్రవారం నాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. గంధపు చెక్కల దొంగ వీరప్పన్ గతంలో ఆమె పైన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
వీటిని ప్రసారం చేసినందుకు రూ.10,00,500 చెల్లించాలని సదరు టీవీ ఛానల్ యాజమాన్యాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇది పద్దెనిమిదేళ్ల క్రితం నాటి కేసు. ఏప్రిల్ 7, 1996వ సంవత్సరంలో దీనిని టీవీ ఛానల్ టెలికాస్ట్ చేసింది. అందులోనే వీరప్పన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూను తమిల్ బై వీక్లీ 'నక్కీరన్'కు చెందిన రిపోర్టర్ చేశాడు. అతను నక్కీరన్ గోపాల్. దీనికి సంబంధించి గతంలో మద్రాస్ హైకోర్టులో నటి సుకన్య పిటిషన్ దాఖలు చేశారు. తనకు నష్ట పరిహారం చెల్లించాలని ఆమె అందులో పేర్కొన్నారు.
అనంతరం ఈ కేసు మద్రాస్ హైకోర్టు నుండి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ట్రాన్సుఫర్ అయింది. దీనిపై 'నక్కీరన్' కోర్టుకు... అగ్రిమెంట్లో భాగంగా తాము దానిని ఇచ్చామని తెలిపింది. ఈ కేసు శుక్రవారం నాడు ముగిసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. నటికి పదిలక్షల రూపాయలను చెల్లించాలని సదరు టీవీని ఆదేశించారు. మరోవైపు, నక్కీరన్ గోపాల్కు ఊరట లభించింది.